16 ఏళ్ల తర్వాత బుర్రిపాలెంకు మహేష్, 70మంది బౌన్సర్లు: రూ.7 కోట్ల నిధులు
విజయవాడ: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి పుట్టిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఆదివారం నాడు పర్యటించనున్నారు. మహేష్ బాబు తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఏపీలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం శ్రీమంతుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ చిత్రంలో మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడు. దత్తత కాన్సెప్టుతో వచ్చిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ఈ మార్చి నెలలో మహేష్ సతీమణి, సోదరి స్వయంగా వచ్చి ఆ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరో రెండు నెలల్లో మహేష్ బాబు మీ ఊరికి వస్తారని గ్రామస్తులకు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం మహేష్ బాబు రోడ్డు మార్గంలో బుర్రిపాలెం చేరుకోనున్నారు.
మధ్యాహ్నం మహేష్ బాబు కనక దుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బుర్రిపాలెంకు చేరుకుంటారు. బుర్రిపాలంలో మూడవేలకు పైగా జనాభా ఉంది. సొంత ఇంటికి వెళ్లి, నాయనమ్మ, మాజీ సర్పంచ్ నాగరత్నం నిర్మించిన గీతా మందిరంలో దైవదర్శనం చేసుకుంటారు.
అనంతరం పలు సమస్యల పరిష్కారం దిశగా, పలు పనులు ప్రారంభించనున్నారు. మహేష్ రానుండడంతో బుర్రిపాలెం వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహేష్ బాబుకు, ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్ను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. మహేష్ బాబు వెంట 70 మంది బౌన్సర్లతో భద్రతకు నియమించబడ్డారు.
ఎప్పుడో పదహారేళ్ల కిందట..
ఎప్పుడో పదహారేళ్ల కిందట గ్రామానికి వచ్చిన మహేశ్ బాబు కోసం బంధువులు ఆప్యాయతతో ఎదురు చూస్తుంటే, గ్రామస్థులు కోటి ఆశలతో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
సమస్యలను గుర్తించారు..
బుర్రిపాలెంలో పదిహేడు ప్రధాన సమస్యలు ఇప్పటికే గుర్తించారు. వాటిలో అత్యవసర ప్రాధాన్యం కింద ఐదు, మధ్య ప్రాధాన్యం కింద ఆరు పనులు, చివరి క్రమంలో మరో ఆరు సమస్యలను తీసుకున్నారు. వీటిని ఆ ప్రణాళిక ప్రకారం పరిష్కరించుకుంటూ వెళ్లేందుకు ప్రణాళికను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.
వీటి మొత్తం విలువ రూ.7.18 కోట్లు. అయితే వీటిలో తొలి ప్రాధాన్యం కింద రూ.2.16 కోట్ల విలువైన పనులకు సంబంధించిన పైలాన్ను మహేశ్ బాబు ఆవిష్కరించి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తే బుర్రిపాలెం నిజంగా ఆదర్శంగానే నిలుస్తుంది.
గ్రామస్థులతోపాటు వారి పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల యువత కూడా ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే ఎంపీ జయదేవ్ తన అత్తవారి గ్రామం బుర్రిపాలెంను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఇద్దరూ కలిస్తే తమకూ ఉపాధి లభిస్తుందనేది యువత ఆశ.
బుర్రిపాలెం గ్రామంలో తొలి ప్రాధాన్యం కింద ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనితోపాటు తాగునీటి సరఫరా మెరుగుపరచడం, సిమెంటు డ్రెయిన్లు, లింకురోడ్ల నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వీటికి మొత్తంమీద రూ. 2.85 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
రెండో ప్రాధాన్యం కింద సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనం, గ్రామం మొత్తం పచ్చదనం పెంచేలా మొక్కలు నాటటం, ఒక కమ్యూనిటీ భవనం నిర్మాణం, ప్రభుత్వంతో మాట్లాడి మీసేవ కేంద్రం ఏర్పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు.
ఈ పనులకు రూ. 2.57 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని గుర్తించారు. చివరి ప్రాధాన్యం కింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధునిక విద్యావిధానానికి అవసరమైన పరికరాలను సమకూర్చడం, ప్రహరీ నిర్మాణం, ఆటస్థలం అభివృద్ది, పాత తరగతి గదుల మరమ్మతుల ఆలోచన చేస్తున్నారు.
వీటితోపాటు అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. పి.డబ్ల్యూ.య.ఎస్ పథకం కింద 360 సోలార్ వీధి దీపాల ఏర్పాటు, గృహనిర్మాణ పధకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి పనులను చేయనున్నారు.
వీటికి కూడా మరో రూ.1.76 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తంమీద రూ.7.18 కోట్ల నిధులు అవసరం అవుతాయనేది అంచనా. వీటిని మహేశ్ బాబుతోపాటు, జయదేవ్ తన ఎంపీ నిధుల నుంచి కొంత సమకూరుస్తారు.