మోడీ అప్పుడేం చెప్పారు?.. నడిరోడ్డుపై కాల్చేయాలి: మహేష్ కత్తి
అనంతపురం: సినిమాలు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేసే విమర్శకుడు కత్తి మహేశ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు.
నోట్ల రద్దు సమయంలో.. 50రోజుల్లో ప్రజలందరికీ దాని ఫలాలు అందుతాయని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ నేటికి దేశానికి ఆ ఫలాలు అందకపోగా.. నోట్ల రద్దు వ్యవహారంతో ఎంతోమంది అమాయకులు బలైపోయారని అన్నారు.
ఈ పరిస్థితికి కారణమైన నరేంద్ర మోడీని నడిరోడ్డుపై కాల్చేయాలని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.మోసాలు, అబద్ధాలు, ద్రోహానికి చిరునామాగా మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇన్నాళ్లు మనల్ని రక్షిస్తూ వచ్చిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం రక్షించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ దళిత వ్యతిరేక విధానాల్ని సాగనివ్వం:
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై ఇటీవల కత్తి మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
'అధికార పీఠాల్ని ఎక్కే సత్తా ఇంకా సంపాదించుకోలేదు. కానీ ప్రభుత్వాల్ని కూల్చే దమ్ము మాత్రం దళితులకు ఉంది. బీజేపీ దళిత వ్యతిరేక విధానాలు ఇంకా ఎంతో కాలం సాగవు. కోర్టులని కూడా తమ అజెండాలో నింపేసిన మనువాదం కుట్రలు చెల్లవు' అని ఇటీవలే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.