మహేష్ కత్తి పొలిటికల్ పంచ్: ఎపిలో హైకోర్టు చిచ్చు, శ్రీబాగ్ ఒడంబడిక
Recommended Video
హైదరాబాద్: తన ఫేస్బుక్ వ్యాఖ్యల ద్వారా, ట్వీట్ల ద్వారా వివాదాలు సృష్టిస్తున్న సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వరుస వ్యాఖ్యలతో దుమారం రేపిన మహేష్ కత్తి ఈసారి రాజకీయ వ్యాఖ్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన వ్యాఖ్యను పోస్టు చేశారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో దానికి ప్రాసంగికత ఒనగూరింది.
కత్తి మహేష్ ట్వీట్ ఇదీ...
ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ తన హైకోర్టును ఏర్పాటు చేసుకుంటోంది. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉది. కర్నూలు,, కడప, అనంతపురం, తిరుపతిల్లో ఎక్కడైనా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
అమరావతి కోస్తాలో ఉంది కాబట్టి...
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందున హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనేది మహేష్ కత్తి అభిప్రాయంగా చెప్పవచ్చు. రాయలసీమలో ఇప్పటికే కొన్ని వర్గాలు రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ అనుభవాలను తెలుసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావుల నుంచి రాయలసీమ మేధావులు, రచయితలు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి.
శ్రీబాగ్ ఒడంబడిక ఇందుకు..
మద్రాసు రాష్ట్రం నుంచి వేరై రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ బ్రిటిష్ పాలకుల హయాంలోనే ప్రారంభమైంది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు మద్రాసు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించడానికి ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అని అంటారు. 1937లో ఈ ఒప్పందం జరిగింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంపై వివాదం
మద్రాసు నుంచి విడిపోతే కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాల నుంచి తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, తమకు ప్రత్యేకమైన రక్షణలు కావాలని రాయలసీమ నాయకులు పట్టుబట్టారు. అది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా మారింది. దీంతో రాయలసీమ నాయకులను ఒప్పించడానికి శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే విషయంతో 1926లో ఈ విభేదాలు మొదలయ్యాయి. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి డా. సుబ్బారాయన్ తీసుకున్న నిర్ణయాలు అందుకు కారణమయ్యాయి. ఆ తరువాత 1913నుండి, 1935 వరకు జరుగుతూ వచ్చిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలోను ఇవి బయటపడుతూ ఉండేవి. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ఓడించడానికి రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు.
రాయలసీమకు రక్షణల కోసం.
1937లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాలలో పాల్గొన్న నాయకులు ఇరు ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని మొదలైన విషయాలలో రాయలసీమకు రక్షణలు అవసరమన్న భావనను రాయలసీమ నాయకులు వ్యక్తం చేశారు. ఈ విషయాలను పరిశీలించేందుకు ఒక సంఘాన్ని నియమించారు.
వీరే సంఘం సభ్యులు..
ఆ సంఘ సభ్యులుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, హాలహర్వి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, టి.ఎన్.రామకృష్ణారెడ్డి, మహబూబ్ ఆలీ బేగ్, దేశిరాజు హనుమంతరావు, కల్లూరు సుబ్బారావు, దేశపాండ్య సుబ్బారావు, వరదాచారి, పప్పూరి రామాచారి, సుబ్బరామిరెడ్డి, ముళ్ళపూడి పల్లంరాజు వ్యవహరించారు. ఈ సంఘ సభ్యులంతా 1937 నవంబర్ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్లో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.
అనంతపురంలో విశ్వవిద్యాలయ కేంద్రం
విశ్వవిద్యాలయం: రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కోసం విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి. సాగునీటిపారుదల అభివృద్ధి: వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేశారురు.
రాజధాని ఆంధ్రలో ఏర్పాటు చేస్తే..
రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్ర ప్రాంతంలో, హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. ఈ రెండింటిలో ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. ఆ శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రలో ఏర్పాటు కావడంతో హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే శ్రీబాగ్ ఒడంబడిక అంశాన్ని మహేష్ కత్తి లేవనెత్తినట్లు భావించాల్సి ఉంటుంది.