టిడిపిలోకి గల్లా: ప్రిన్స్ మహేష్ మద్దతుందని జయదేవ్
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి, ఆమె తనయుడు గల్లా జయదేవ్ శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గల్లా అరుణ మాట్లాడారు. పార్టీనే నమ్ముకున్న తమకు విభజన పేరుతో కాంగ్రెసు నమ్మక ద్రోహం చేసిందన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. తనకు నటుడు మహేష్ బాబు, ఆయన తండ్రి కృష్ణల మద్దతు ఉందని చెప్పారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందని వాడయినప్పటికీ తనకు మద్దతిస్తారని చెప్పారు. తాను మంచి పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. తన తల్లి గల్లా అరుణ చంద్రగిరి నుండి పోటీ చేసే విషయమై ఇప్పుటే తానేమీ మాట్లాడనని చెప్పారు.
సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమన్నారు. అందుకే తాము టిడిపిలో చేరుతున్నామన్నారు. చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. గల్లా జయదేవ్కు మహేష్ బాబు బంధువైన విషయం తెలిసిందే. కృష్ణ కూతురును జయదేవ్ వివాహమాడారు. జయదేవ్ గుంటూరు నుండి లోకసభకు పోటీ చేయనున్నారు.
మరోవైపు, ప్రధాన రాజకీయ పార్టీలకు వలసల తాకిడి కొనసాగుతూనే ఉంది. సీమాంధ్రలో టిడిపిలోకి అధికశాతం మంది వలసబాట పడుతుండగా, ఇంకా నామకరణానికి నోచుకోని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వైపూ పలువురు నేతలు చూపులు సారిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెహమాన్ టిడిపిలో చేరారు. గతంలో టిడిపిలో ఉన్న రెహమాన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, వుడా చైర్మన్గా పని చేశారు.
అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కూడా టిడిపిలో చేరనున్నారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. గతంలో టిడిపి తరపున రాజంపేట ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న రామయ్య టిడిపి నుంచి రాజంపేట ఎంపీ సీటు ఆశిస్తున్నారు.