శ్రీ గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు
తూర్పుగోదావరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సందీప్, దుర్గాప్రసాద్లను పాలకొల్లు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
తొలుత పోలీసులు ఈ కేసును ప్రమాదంగా భావించగా అనంతరం సిఐడి విచారణలో హత్యగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రాధమికంగా మొత్తం ఎనిమిది మందికి ఈ హత్యలో ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్ల బెయిల్ రద్దు చేసి అరెస్ట్కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు.
ఆ మేరకు పాలకొల్లు పోలీసులు వీరిరువురును విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు తెలిసింది. సీఐడీ దర్యాప్తుతో గౌతమిది హత్యాగా తేలడంతో ఆమె కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్లుగా కేసులో మార్పులు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే శ్రీ గౌతమి హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకరైన డ్రైవర్ లక్ష్మణ రావును అదుపులోకి తీసుకొని శుక్రవారం కోర్టులో హజరుపరిచారు. హత్య జరిగిన రోజు హంతకులతో పాటు ఇతడు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్ను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.