పాలమూరు పోటీ: జైపాల్ రెడ్డికి అంత ఈజీ కాదు
మహబూబ్నగర్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ లోకసభ స్థానంలో ఈసారి రసవత్తరమైన పోరు సాగనుంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం నుంచి తన సొంత నియోజకవర్గమైన మహబూబ్నగర్కు మారారు. తెరాస అభ్యర్థిగా పి. జితేందర్ రెడ్డి ఈసారి పోటీ చేస్తున్నారు. బిజెపి తరఫున శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు.
ముగ్గురు నాయకులకు కూడా జిల్లాపై పట్టుంది. దీంతో ఇక్కడ పోటీ త్రిముఖంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, తెరాస ఒంటరి పోరుకు సిద్ధపడగా, బిజెపి, టిడిపిల పొత్తు కుదిరింది. దీంతో నాగం జనార్దన్ రెడ్డికి ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రత్యర్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు కుంపట్లు ప్రత్యర్థులకు సహకరిస్తే జైపాల్రెడ్డి ఏ మేరకు రాణిస్తారో అనే అంశం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారిపొయింది. రాష్ట్ర మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె అరుణ జైపాల్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎంపి జితేందర్రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందంజలో ఉన్నారు. జితేందర్రెడ్డి, జైపాల్రెడ్డి పోటీ పడటం ఇది మూడోసారి.
ప్రస్తుతం తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్రెడ్డి తొలిసారిగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి కూడా పోటీలో ఉండడంతో విజయం దోబూచులాడే అవకాశం ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.