టీడీపీకి కాపు నేతల భారీ షాక్: 20 మంది రహస్య సమావేశం: బీజేపీ లోకి వెళ్లటం పైనే చర్చ..!
తెలుగుదేశంలో సంక్షోభం. ఏపీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే..బీజేపీ నేతలు ఆట మొదలు పెట్టారు. ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీ వీడుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోని టీడీపికి చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. కాకినాడలో దాదాపు 20 మంది కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరుగుతన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సమాచారం ఇవ్వకుండా సమావేశం అవ్వటం ద్వారానే వారంతా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపు నేతలు బీజేపీ బాట పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
టీడీపీలో సంక్షోభం..
తెలుగుదేం పార్టీలో సంక్షభం ఏర్పడింది. ఎన్నికల్లో పార్టీ ఓడటంతో ఆ పార్టీలోని నేతలు ఇక టీడీపీలో కంటిన్యూ అవలేమని నిర్ణయించిన నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. చంద్రబాబుకు వీర విధేయులుగా ఉంటూ లబ్ది పొందిన నేతలే పార్టీని వీడుతున్నారు. సుజనా చౌదరి..సీఎం రమేష్ లాంటి వారే పార్టీని వీడుతున్న సమయంలో ఇక టీడీపీకి భవిష్యత్ లేదనే భావనలో పార్టీ నేతలు ఉన్నారు. దీంతో.. అనూహ్యంగా..పార్టీకి ఎటువంటి సమాచారం లేకుండా గతంలో టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న కాపు వర్గానికి చెందిన దాదాపు 20 మంది నేతలు కాకినాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాయకత్వంలో జరుగుతోంది. ఇక, టీడీపీలో రాజకీయంగా భవిష్యత్ లేదని...అదే సమయంలో వైసీపీలోకి వెళ్లలేని స్థితిలో ఏం చేయాలనే దాని పైనే ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు.
Recommended Video
బీజేపీ సూచనల మేరకేనా..
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు ఉండి..ఇప్పుడు బీజేపీలో చేరటం ఖాయమైన సమయంలో ఆయన సూచనల మేరకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను కాపు నేతల్లో పేరున్న తోట త్రిమూర్తులకు బాధ్యత అప్పగించారు. ఆయన అత్యంత రహస్యంగా కాపు నేతలను సమావేశానికి ఆహ్వానించారు. ఏపీలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలంటే కమ్మ..కాపు వర్గాలను తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో బీసీలు పూర్తిగా వైసీపీకి మద్దతు ప్రకటించటంతో..ఇప్పటికిప్పుడు ముందుగా ఈ రెండు వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సుజనా చౌదరితో చర్చల ఫలితంగా ఈ భేటీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీలో వారికి ఇచ్చే అవకాశాలను వివరించే బాధ్యత సైతం ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది.
టీడీపీకి గుడ్ బై..బీజేపీలోకేనా..
తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరగుతున్న ఈ సమవేశంలో బూరగడ్డ వేద వ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు,చెంగళ్రాయుడు,బండారు మాథవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు ,పంచకర్ల రమేష్ బాబు వంటి వారు ఉన్నారు. కాపు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత లేదని..అదే సమయంలో వైసీపీలో గుర్తింపు ఉండదని చెబుతూ..కాపు నేతలు బీజేపీలో చేరటం ద్వారా.. ఏపీలో కొత్త శక్తిగా అవతరించవచ్చని బీజేపీ నుండి వచ్చిన సమాచారంగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తాము బీజేపీలో చేరటం లేదని..ఓటమి గురించి చర్చించటానికే సమావేశం అయ్యామని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. ఓటమి గురించి అయితే కేవలం కాపు వర్గానికి చెందిన వారే ఎందుకు సమావేశం అవుతున్నారు..అదే విధంగా పార్టీకి సమాచారం లేకుండా ఎందుకు భేటీ అవుతున్నారనే దానికి మాత్రం సమాధానం లేదు. దీంతో..వీరు బీజేపీని ఎంచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.