అమరావతి...కాదంటే అక్కడే: రాజధానిపై అత్యధికుల మనోగతం: సీమలో ఇలా..కమిటీ రిపోర్ట్ సిద్దం..!
ఏపీ రాజధాని ఎక్కడ. కొద్ది కాలంగా ఏపీలో రాజకీయంగానే కాకుండా..సాధారణ ప్రజల్లోనూ సాగుతున్న చర్చ. దీని పైన ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. దాదాపు 40 వేల సూచనలు కమిటీకి అందినట్లుగా తెలుస్తోంది. అయితే..అందులో అధిక శాతం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించకూడదని భావిస్తే..తప్పని పరిస్థితుల్లో మరో ప్రాంతం పైన అత్యధికులు మొగ్గినట్లుగా సమాచారం. ఈ మొత్తం సమాచారంతో పాటుగా సలహాలు..సూచనలతో కూడిన నివేదిక ఈ నెల 20న ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తోంది.
అప్పటి వరకు నిధులు రావు: 'పోలవరం’పై తేల్చేసిన కేంద్రమంత్రి, ఏపీ ఎంపీల ప్రశ్నలు
అమరావతికి తొలి ప్రాధాన్యత..
ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వంలో కొంత అస్పష్టత ఉన్నా.. ప్రజల్లో మాత్రం స్పష్టత కనిపిస్తోంది. రాజధానితో పాటుగా నగరాలు..పట్టణాల అభివృద్ధి పైన ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏయస్ జీఎన్ రావు కమిటీకి నాయకత్వం వహించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించారు. పలు సంఘాలు..నేతలు నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలను స్వీకరించారు. అందులో రాజధాని పైనే ఎక్కువగా ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వచ్చాయి. గత ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్కు అనుగుణంగానే దానిని నిర్మించాలని, అందులో ఇప్పటికే ప్రారంభించిన వివిధ ప్రాజెక్టులను యథాతథంగా కొనసాగించాలని పలువురు అభ్యర్థించారు.
రెండో ప్రాధాన్యత ఆ ప్రాంతానికే..
ఇదే సమయంలో అమరావతి కొనసాగించాలని కోరుతూనే..ప్రభుత్వం ఏదైనా కారణాలతో అక్కడ రాజధాని కొనసాగించ కూడదని భావిస్తే అధిక శాతం మంది రెండో ప్రతిపాదనగా విశాఖ నగరాన్ని సూచించినట్లు తెలుస్తోంది. భౌగోళికపరమైన పలు సానుకూలతలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం, మనోల్లాసాన్నిచ్చే సముద్రతీరాన్ని కలిగి ఉండడంతోపాటు ఇప్పటికే రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్గా రూపొందడాన్ని పరిగణనలోకి తీసుకుని, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలని కొందరినుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్రస్థాయి సంస్థలు పెద్దసంఖ్యలో కొలువు దీరిన రీత్యా అసలైన కాస్మోపాలిటన్ సంస్కృతి తొణికిసలాడుతున్న దృష్ట్యా రాజధాని అయ్యేందుకు విశాఖపట్నం అన్ని విధాలుగా అర్హమైనదని వారు పేర్కొన్నారని సమాచారం. దీని ద్వారా ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని పలువురు తమ అభిప్రాయంగా కమిటీ ముందు నివేదించినట్లు తెలుస్తోంది.
కర్నూలు లో హైకోర్టు..నివేదిక సిద్దం
ఇక, ఆ తర్వాతి రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన వినతులు వచ్చాయి. వికేంద్రీకరణకు పెద్దపీట వేయడమే కాకుండా 1950 దశకంలో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కొందరు విన్నవించారు. ఇలా..ప్రాంతాలవారీ ఆకాంక్షలు ప్రతిబింభించేలా అన్ని రకాల అభిప్రాయాలతో సిద్దం చేస్తూ..ఆ నివేదికకు తమ సూచనలు..సలహాలు కలిపి ఇచ్చేందుకు కమిటీ తుది కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు చెందిన పలువురు ఈ-మెయిళ్ల రూపంలోనూ, కొందరు లేఖల ద్వారానూ తమ తమ ప్రాంతాల ప్రగతికి తోడ్పడే అంశాలకు సంబంధించి ఈ కమిటీకి వేల సంఖ్యలో సలహాలు, సూచనలు చేశారు. వీటిని క్రోడీకరించి ఈ కమిటీ తన నివేదికను ఈ నెల 20వ తేదీకి కాస్త అటూఇటూగా సమర్పించనున్నట్లు సమాచారం.