ఆర్టీసీలో ఫిట్ మెంట్ రచ్చ: డివైడ్ అండ్ రూల్: ఆర్టీసీ అధికారుల రూల్ అదే
డివైడ్ అండ్ రూల్. బ్రిటీషోళ్ల విధానం ఇది. ఉమ్మడిగా ఆందోళన చేస్తోన్న ప్రజలను గానీ, కార్మికులను గానీ.. మభ్య పెట్టి నిట్ట నిలువుగా చీలకలు తీసుకొచ్చే విధానమే ఇది. అప్పుడెప్పుడే బ్రిటీషర్లు మనదేశంలో విడిచి వెళ్లిన ఈ అనాగరిక విధానాన్ని ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇదే రూల్ ను పాటిస్తున్నారు కూడా. ఫిట్ మెంట్ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో అధికారులు నిర్వహించిన చర్చలు డివైడ్ అండ్ రూల్ నిబంధనకు లోబడే సాగింది. ఫిట్ మెంట్ పై ఒకట్రెండు కార్మిక సంఘాలు ఓకే చెప్పడం..మిగిలిన కార్మిక సంఘాలకు ఆగ్రహాన్ని తెప్పించింది. తమకు ఏ మాత్రం ఇష్టం లేని, సరిపోని ఫిట్ మెంట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలను నిర్వహిస్తున్నారు.
తమకు 50 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటిసు ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ ఆర్టీసీలో సమ్మె ఆరంభం కావాల్సి ఉంది. ఈలోగా రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాలు, ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని 50 శాతం ఫిట్ మెంట్ ఇవ్వలేమని, 25 శాతానికి అంగీకరించాలని ప్రతిపాదించారు. దీనిపై చర్చల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మెను విరమించారు.
50 శాతం ఫిట్ మెంట్ సాధిస్తామని హామీ ఇచ్చి, చివరికి 25 శాతానికి ఒప్పుకోవడాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమకు 50 శాతం చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకుని రావాలని డిమాండ్ చేస్తోంది. 25 శాతం ఫిట్ మెంట్ కు నిరసనగా ఆ యూనియన్ లో సభ్యులుగా ఉన్న కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్దా ధర్నాలు చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గేట్ల వద్ద బైఠాయించారు. నల్ల బ్యాడ్జీలను ధరించి, విధులకు హాజరయ్యారు. ఫిట్ మెంట్ కోసం తాము దాదాపు రెండేళ్లుగా వేచి చూస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ ఫిట్ మెంట్ తమను నిరుత్సాహ పరిచిందని వాపోతున్నారు. దీన్ని బ్లాక్ డే అభివర్ణిస్తున్నారు. తమ తరఫున చర్చల్లో పాల్గొన్న జేఏసీ నాయకులపై మండిపడుతున్నారు.
దీనిపై జేఏసీ నాయకుల వాదన మరోరకంగా ఉంది. 25 శాతం ఫిట్ మెంట్ అనేది తుది నిర్ణయం కాదని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ తర్వాత వారితో సమానంగా బెనిఫిట్లను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్రావు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం, 50శాతం వేతన సవరణ సాధిస్తాం అని కార్మికులను మభ్యపెట్టి ఓట్లేయించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ 52 వేల మందికి ద్రోహం చేసిందని ఎన్ఎంయూ నేతలు మండిపడ్డారు. విజయవాడ, తిరుపతిలో నిరసనలో పాల్గొని జేఏసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేతలు ఎంతకు అమ్ముడు పోయారని నిలదీశారు.