మీరూ సిబిఐతో విచారణ చేయించుకుంటారా?...కేంద్రానికి చంద్రబాబు ప్రశ్న
Recommended Video
అమరావతి: కాగ్ మామీదే కాదు మీ మీద కూడా నివేదికలిచ్చింది కదా...మరి మీరూ సిబిఐతో విచారణ చేయించుకుంటారా?...అంటూ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ పథకంపై నిధుల దుర్వినియోగం గురించి కాగ్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో బిజెపి సభ్యులు చేసిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సిఎం కేంద్రంపై ఈ ప్రశ్నసంధించినట్లు తెలుస్తోంది.
ప్రపంచ జలదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని సిఎం గురువారం శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో అవినీతిని నిర్మూలిస్తామన్న ప్రధాని, తన కార్యాలయంలో ఎ1, ఎ2లను పక్కన పెట్టుకుని రాష్ట్రంపై కుట్రకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇవెక్కడి రాజకీయాలు...చంద్రబాబు విస్మయం
ఎన్నికల సమయంలో...కేంద్రంలో అధికారం చేపట్టిన తొలినాళ్లలో...నాడు ఏం చెప్పారు, రాష్ట్రానికి ఇంతవరకు ఏమిచ్చారో చెప్పాలని బిజెపిని డిమాండ్ చేశారు. అన్నిరాష్ట్రాలకు రెగ్యులర్గా వచ్చే నిధులే రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పమని తాను డిమాండ్ చేస్తే తన పైనే ఎదురు దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదని తనతో అబద్దం చెప్పారన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపినా ఎందుకు చర్చకు రానివ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధికి సహకరించమంటుంటే సిబిఐ విచారణలంటున్నారని, అన్నింటిపైనా సిబిఐతో విచారణ చేయిస్తారా... ఇవెక్కడి రాజకీయాలంటూ చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.
పోలవరానికి...కేంద్రం...రూ.42,000 కోట్లు ఇవ్వాలి
పోలవరం ప్రాజెక్ట్ మీద తమ ప్రభుత్వం ఇంతవరకు రూ.13,201 కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే డిపిఆర్-2ను సవరించి ఇంకా కేంద్రం రూ.42,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. మరోవైపు ఎవరికి వారు పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రం నుంచి తానే తీసుకున్నానని పవన్ కల్యాణ్ అంటున్నారని, తాను ఆ ప్రాజెక్ట్ను తీసుకోలేదని, నీతి ఆయోగ్ చెప్పిన మీదటే పోలవరాన్నిఇప్పటి వరకు 54 శాతం పూర్తి చేయించామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. రావాల్సిన డబ్బులొస్తే 2019కి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, కరువు అనేదే ఉండదని చంద్రబాబు తెలిపారు.
నేను భయపడను...తెరిచిన పుస్తకం
బిజెపి, వైసిపి, పవన్ ఒక్కటయ్యారని...అయినా తాను ఎటువంటి కేసులకూ భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసి ప్రతి లావాదేవీ ఆన్లైన్ చేయాలని సూచించింది తానేనని గుర్తు చేశారు. రాజకీయాల్లో సేవే కొలమానంగా ఉండాలని, చేసే పనులను బట్టే ఓట్లు అడగాలని చంద్రబాబు అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారూ దీన్ని గుర్తించుకోవాలని పరోక్షంగా పవన్,జగన్లకు చురకలు అంటించారు. ఇక తన జీవితం తెరచిన పుస్తకమని, తన కుటుంబం అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
బిజెపి ఎమ్మెల్సీతో...వాగ్వాదం...
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు కాక పోవడంతో నేడు రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు రోడ్డెక్కాయని శాసనమండలిలో మాట్లాడుతూ చంద్రబాబు అనగానే బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అడ్డుతగిలి రోడ్ల మీదకు వెళ్లే విధంగా మీరే చేశారని అనడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. సిఎం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ ప్రత్యేకహోదా, హామీలు అమలు కాక పోవడంతో ప్రజలందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్ధితులు కేంద్రం కల్పించిందన్నారు. అందుకే నేషనల్ హైవేల దిగ్భందనం ద్వారా ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారని చంద్రబాబు చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ మాధవ్ మరలా జోక్యం చేసుకుని గతంలో కిరణ్కుమార్ రెడ్డి హయాంలో కూడా ప్రభుత్వం ఇలాగే మద్దతునివ్వడంతో రాష్ట్రం వెనుకబడిందని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తాను ఆందోళనలకు మద్దతునివ్వలేదని, జపాన్ తరహా ఉద్యమం చేయమని చెప్పానని అన్నారు. మరలా మాధవ్ మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రత్యేకహోదా ప్రస్తుతం ఎక్కడా లేదని అన్నారు.