అంతర్వేది ఆలయ రథం తయారీ ప్రారంభం- ప్రత్యేక పూజలు.. కళ్యాణోత్సవం కల్లా సిద్దం...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో అనూహ్య పరిస్ధితుల్లో దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రధం దగ్ధమైంది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే స్వామి కళ్యాణోత్సవం నాటికి మరో కొత్త రథం తయారీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కల్లా ఎట్టిపరిస్ధితుల్లోనూ రథం సిద్ధం కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో అధికారులు ఇవాళ కొత్త రథం తయారీని ప్రారంభించారు. రావులపాలెంలోని వెంకట సాయి టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన కలపను గుర్తించి దానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో పాటు దేవాదాయశాఖ ప్రతినిధులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ రథం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.95 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
అంతర్వేది ఆలయ రథం దగ్ధం నేపథ్యంలో విపక్షాలు, హిందూసంస్ధల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆఘమేగాల మీద డిజైన్లు తెప్పించి వాటిలో ఒకదానికి ఆమోదముద్ర వేసింది. గతంలో కంటే మెరుగైన రథాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ ఫిబ్రవరి నాటికి నిర్మించి తీరాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది.
దీంతో అధికారులు దగ్గరుండి మరీ రథం తయారీని పర్యవేక్షిస్తున్నారు. రథం తయారీకి అవసరమైన కలపతో పాటు ఇతర వస్తువులన్నీ తూర్పుగోదావరి జిల్లాలోనే లభిస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా దీని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.