‘అన్యాయం జరుగుతున్నా..! ఇంకా టీడీపీలో ఎందుకు?’
తెలుగుదేశం పార్టీపై మాలమహానాడు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య మండిపడ్డారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీపై మాలమహానాడు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య మండిపడ్డారు. ఎస్పీలందరూ టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీలో మాల, మాదిగ సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతోందని వారన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం జరగడం లేదని చెంగయ్య విమర్శించారు.
ఎన్టీఆర్ హయాంలో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, భారీ నీటిపారుదల శాఖలను దళితులకు కేటాయించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు హయాంలో దళితులకు సరైన ప్రాతినిథ్యం లేకుండా పోయిందని చెంగయ్య మండిపడ్డారు. పొలిట్ బ్యూరో నుంచి దళిత ఎంపీ శివప్రసాద్ను తొలగించారని చెప్పారు.
కాపు సామాజికవర్గీయుల మెప్పు కోసం మంత్రివర్గం నుంచి పీతల సుజాతను తొలగించారని అన్నారు. గిరిజనమండలిలో కూడా రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ నేతలను నామినేట్ చేశారని చెంగయ్య ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి వల్లే గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారని చెప్పారు.