అందుకే కేసీఆర్ను పొగిడా: టీడీపీ ఎంపీ, బాబును తప్పించేయత్నం: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన నియోజకవర్గానికి వచ్చినందునే ఆయనను తాను స్వాగతించానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత మల్లారెడ్డి శనివారం వివరణ ఇచ్చారు.
తాను వ్యక్తిగత అజెండాతో సీఎం కేసీఆర్ను పొగడలేదన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తి లేనే లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
కాగా, రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి సీఎంను పొగడటం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
బాబును తప్పించే ప్రయత్నాలు: పొంగులేటి
రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాదులో అన్నారు. రేవంత్ కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్నారు.
ఈ కేసును వేగవంతం చేయాలన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.