'వంగవీటి' ఎవరి చెప్పు చేతల్లో..: వర్మకు 24 గంటల డెడ్లైన్, హెచ్చరిక
వంగవీటి సినిమా విషయమై దర్శకులు రామ్ గోపాల్ వర్మ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: వంగవీటి సినిమా విషయమై దర్శకులు రామ్ గోపాల్ వర్మ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వర్మ ఎవరి చెప్పు చేతల్లో ఉండి ఈ సినిమా తీశారో చెప్పాలని ఆయన నిలదీశారు.
'మీరే అంతమవుతారు, మొరగడం ఆపండి, పెట్రోలు లేకుండా తగలబెడతా'
వర్మ తీసిన ఈ సినిమా సన్నివేశాలపై అభ్యంతరాలు తెలుపుతూ ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మల్లాది విష్ణు.. విజయవాడలో సబ్కలెక్టర్ సలోనికి వినతిపత్రం అందించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
వర్మతో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మల్లాది విష్ణు తెలిపారు. వంగవీటి మోహన రంగా పైన వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. సినిమాలోనూ ఆయన జీవితాన్ని వర్మ వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపునాడు ఆగ్రహం
పేదల కోసం కుల, మతాలకతీతంగా ప్రజలకు సేవలందించిన వంగవీటి రంగాను కించపరిచేలా ఉన్న వంగవీటి చిత్రాన్ని తక్షణమే నిలిపివేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావు సోమవారం డిమాండ్ చేశారు.
పేదల పక్షపాతిగా పేరు గడించిన రంగాను వంగవీటి చిత్రంలో రౌడీగా చిత్రీకరించడం పట్ల రాష్ట్రంలో రాధా, రంగా అభిమానులను నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇరవై నాలుగు గంటల్లో చిత్ర దర్శక, నిర్మాతలు చర్యలు తీసుకోని పక్షంలో జరగబోయే పరిణామాలకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు.