ఎవరితో విభేదాల్లేవు, జగన్ ఆదేశిస్తేనే: మల్లాది విష్ణు, వంగవీటి డెడ్లైన్!
Recommended Video
విజయవాడ: సెంట్రల్ బాధ్యతలను తనకు అప్పగించినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందన్నారు. మళ్లీ వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి పాలన తమ లక్ష్యమని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
టిక్కెట్ లేదు కానీ: తేల్చేసిన అంబటి, అన్యాయం చేశారు.. మాట్లాడతా: వంగవీటి ఆగ్రహం
విజయవాడ సెంట్రల్ టిక్కెట్ వివాదంపై ప్రశ్నించగా.. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. మళ్లీ వైయస్ లాంటి పాలన కావాలని, పార్టీకి అందరూ నేతలు అవసరమని వంగవీటి రాధాకృష్ణను ఉద్దేశించి చెప్పారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, తనకు ఎవరితోను విభేదాలు లేవని చెప్పారు.
కాగా, వంగవీటి రాధకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం పార్టీకి లేదని అంబటి రాంబాబు మంగళవారం చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోటములను బట్టి సీటు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గమైతే రాధాకు గెలుపు అవకాశాలు ఎక్కువ అని, తూర్పుపై ఆయనకు ఆసక్తి లేకుంటే బందర్ నుంచి పోటీ చేయవచ్చునని చెప్పారు. సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించామన్నారు. జగన్ ఆదేశిస్తే తాను సత్తెనపల్లి నుంచి కాకుండా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పారు.
వంగవీటి రాధా వెయిటింగ్
వంగవీటి రాధాకృష్ణ తన కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణును ప్రకటించటంపై వంగవీటి వర్గం ఆగ్రహంతో ఉంది. పలువురు రంగా రాధా మిత్రమండలి సభ్యులు, ఆయన అనుచరులు వంగవీటి రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వాలని, ఆయనను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు.
సోమ, మంగళవారాలు ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. మూడు రోజుల పాటు వేచి చూద్దామన్నారు. అధిష్ఠానం నిర్ణయం తెలుసుకున్న తరువాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిద్దామన్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు పార్టీ మారాలన్నారు. మూడు రోజుల తరువాతే పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.