‘కేసీఆర్! ఏపీ బాబుపై ఎందుకిలా?, రేవంత్ వ్యాఖ్యలపై స్పందనేది?’
ఇటు చంద్రబాబు ప్రభుత్వం, అటు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. వారు మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడ
విజయవాడ: ఇటు చంద్రబాబు ప్రభుత్వం, అటు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. వారు మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత జగన్ను విమర్శించడమే టీడీపీ నేతల ఏకైక అజెండా అని దుయ్యబట్టారు.
భయమెందుకు?
పాదయాత్ర ప్రకటనను జగన్ చేసినప్పటి నుంచి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జగన్ పాదయాత్ర గురించి టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా వారు చేశారు.
ఆ బాబుపై కేసు.. ఏపీ బాబు ఏది?
ఓ ఫోన్ కాల్ ఆధారంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు పెట్టి, అతని అనుచరులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని.. అయితే, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబును కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయించలేదని వెల్లంపల్లి, మల్లాది విష్ణులు నిలదీశారు.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందనేది?
టీటీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి యనమల రామకృష్ణుడు ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ గురించి అవాకులు, చెవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు.
చినరాజప్పకు ముందు తెలుసా.. 6నుంచే జగన్ పాదయాత్ర
సీబీఐ కోర్టులో జగన్కు ఊరట లభించదనే విషయాన్ని హోంమంత్రి చినరాజప్ప ముందే ఎలా చెప్పారని... ఆయన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు సుమోటోగా స్వీకరించాలని అన్నారు. కాగా, కోర్టు తీర్పుకు లోబడే జగన్ పాదయాత్ర ఉంటుందని, నవంబర్ 6వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుందని వారు చెప్పారు.