పాఠ్యాంశాల్లోకి మల్లి మస్తాన్ బాబు జీవిత చరిత్ర
హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ సోమవారం చెప్పారు. అలాగే, ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్లో కలిసిన ఏడు మండలాల కోసం ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, ప్రముఖ పర్వాతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కొద్ది రోజుల క్రితం ఆండిస్ పర్వతాల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అతడి స్వగ్రామం గాంధీ జనసంగంలో శనివారం జరిగాయి.
ఈ అంతిమ యాత్రకు ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు నారాయణ, పల్లె రఘనాథ రెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మస్తాన్ బాబు భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో గాంధీజనసంగం గ్రామం జనసంద్రమైంది.
గాంధీ జనసంగంలోని మస్తాన్ బాబుకు చెందిన పొలంలోనే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు మల్లి మస్తాన్బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పర్వతారోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించారని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని చాటిందన్నారు.
మస్తాన్ బాబును సజీవంగా తీసుకురాలేకపోయామని విచారణ వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ కోరిక మేరకు ఆఖరి చూపుకైనా మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ, సుష్మస్వరాజ్ చొరవతో అర్జెంటీనా దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చామన్నారు. మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.