ఎంపి కోసమేనా: భట్టి, అప్పుడే అడిగుంటే..: హరీష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల సస్పెన్షన్ విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎంపిపై వ్యాఖ్యలు చేసినందుకే వారిని సస్బెండ్ చేశారా, సభకు అడ్డుతగులుతున్నారని సస్పెండ్ చేశారని ఆయన అడిగారు. ఎంపిపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పలేదు కాబట్టే సస్పెండ్ చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సస్పెండ్ చేయలేదని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. టిడిపి సభ్యులపై సస్పెన్షన్ విషయాన్ని బిజెపి సభ్యుడు లక్ష్మణ్ జీరో అవర్లో శుక్రవారం లేవనెత్తినప్పుడు జరిగిన చర్చలో భాగంగా ఆ విషయం చర్చకు వచ్చింది.
సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే సభను నడపడానికి వీలుంటుందని, ఎలాగైన అడ్డుకోవాలని వచ్చి తెలుగుదేశం సభ్యులు ఇది వరకు కూడా ఓసారి వచ్చారని, అలా సస్పెండ్ చేయించుకుని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించి వచ్చారని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు అన్నారు. టిడిపి సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు హరీష్ రావు వివరణ ఇచ్చారు.
సభను అడ్డుకుంటుంటే సభను నడిపించి మిగతా సభ్యులను మాట్లాడించడానికి సస్పెండ్ చేశామని ఆయన అన్నారు. విద్యుత్తు విషయంలో ఆరోపణలు చేసి, పత్రాలు ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని ఆయన తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి అన్నారు. సభను తప్పుదోవ పట్టించి ద్రోహానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. బడ్జెట్ మీద ప్రసంగించాలని రేవంత్ రెడ్డికి మైక్ ఇచ్చారని, క్షమాపణ చెప్పాలని తాము రేవంత్ రెడ్డిని అడిగామని, సభ మొత్తం కూడా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించిందని ఆయన అన్నారు.
మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి మైక్ ఇస్తే, దయాకర్ రావు మాట్లాడడానికి ప్రయత్నించారని, అప్పుడు రవీంద్ర రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు. పోడియం వద్దకు వచ్చిన సభ్యుల సస్పెన్షన్కు మాత్రమే తాను ప్రతిపాదన చేశానని, మొదట ఆ ప్రతిపాదనలో దయాకర్ రావు, రేవంత్ రెడ్డి పేర్లు లేవని, వారు కూడా పోడియం వద్దకు రావడంతో జాబితాలో వారి పేర్లు కూడా చేర్చామని హరీష్ రావు వివరణ ఇచ్చారు. పోడియం వద్దకు వచ్చిన సభ్యుల సస్పెన్షన్కు మాత్రమే ప్రతిపాదన చేశామని, మిగతా నిన్న సభకు వచ్చారని, సభలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
ఎంపిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పలేదని తాము సస్పెండ్ చేయలేదని, టిడిపి సభ్యులు నోటీసు ఇవ్వకుండా ఎంపిపై తప్పుడు ఆరోపణ చేయడమే కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పు దోవ పట్టించారని, ఓ సభ్యుడి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని ఆయన అన్నారు. సభలో తెలంగాణ పదాన్ని నిషేధించినప్పుడు మీరు ఎందుకు అడగలేదని, ఒక్కపైసా తెలంగాణ ఇవ్వబోమని అప్పటి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని, అప్పుడే ప్రశ్నించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు ఓ పదం తొలిగించి తీర్మానం చేయడానికి తాము అంగీకరించామని, మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిపై పత్రికా వార్తలను పట్టుకుని విమర్శలు చేస్తే ఆయన చేత ముఖ్యమంత్రి వివరణ ఇప్పించారని ఆయన గుర్తు చేశారు.