టీడీపీతో పొత్తుపై మల్లు భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు, 'కేటీఆర్కు లై డిటెక్టివ్ టెస్ట్ చేస్తే వాస్తవాలు'
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము సత్తా చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం చెప్పారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలే భవిష్యత్తులో వస్తాయని ఎవరైనా అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చెప్పారు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బెదిరించి, భయపెట్టి పాలన చేయాలనుకోవడం సరికాదన్నారు.
అధికారంలోకి రానంత మాత్రాన కుంగిపోము
తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయించడం కోసం తాము పోరాటం చేస్తామని మల్లు భట్టి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిలబడాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది పోరాటాల చరిత్ర అన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన తాము కుంగిపోమని చెప్పారు.
కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీనిపై కూడా మల్లుభట్టి స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా కూటమి శాసనసభ ఎన్నికల వరకే పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక సంస్థళ ఎన్నికల్లో కలిసి పోతామా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఓటమికి సమీక్ష అవసరమని, దీనికి సమిష్టి బాధ్యత ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పని అయిపోయిందనుకోవద్దు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారని, తమ పార్టీలోకి వస్తారని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా మల్లు భట్టి స్పందించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకోవడం సరికాదని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. అధికార పార్టీ మాత్రం అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకోవద్దని చెప్పారు.
అధికారం కోసం అర్రులు చాచడం లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో అధికార పార్టీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తాము అధికారం కోసం అర్రులు చాస్తున్నామని విమర్శలు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ అలా చేయదని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన చెప్పారు.
కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ మాట్లాడుతూ.. సాంకేతికంగా ట్యాంపరింగ్కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా దీనిని అంగీకరించారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ట్విట్టర్, వాట్సాప్, ఫోన్ కాల్స్ డేటా తీయాలని చెప్పారు. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే క్షణాల్లో వాస్తవం బయటపడుతుందని చెప్పారు.