కోల్కతా ర్యాలీకి టీడీపీకి మమత ఆహ్వానం, మోడీ నిర్ణయమే.. చేతులెత్తేసిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్ట్ 19వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహిస్తున్న ర్యాలీకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడు కోల్కతాలో మరోసారి విపక్షాలు ఒక్కచోట కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం మమత ప్రయత్నిస్తున్నారు. ఆమె విపక్ష నేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, శివసేన, ఎస్పీ, బీఎస్పీని ఆహ్వానించారు.
Recommended Video
ఇందులో భాగంగా పలు పార్టీల నేతలతో మంగళవారం, బుధవారం చర్చలు జరిపారు. రేపు కూడా చర్చలు జరపనున్నారు. టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాలులో టీడీపీ ఎంపీలను కలిసి అవిశ్వాస తీర్మానం సమయంలో బాగా మాట్లాడారని కితాబిచ్చారు. అనంతరం టీఎంసీ కార్యాలయంలో మమతతో పాటు టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కోల్కతా ర్యాలీకి ఆమె ఆహ్వానించారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీపై సీఎం రమేష్, జగన్పై ఆదినారాయణ తీవ్రవ్యాఖ్యలు
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. బీరేంద్ర సింగ్ తన చేతిలో ఏమీ లేదని, ప్రధాని మోడీయే నిర్ణయం తీసుకోవాలని చెప్పారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు.
బీరేంద్ర సింగ్ మళ్లీ మొదటికొచ్చారని టీడీపీ నేతలు మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అయినా అధికారిక ప్రకటన చేయాలని లేదంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షనేతగా కడప జిల్లాకు జగన్ చేసిందేమీలేదని, జగన్తో రాష్ట్రానికి దరిద్రం పట్టిందన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.