జగన్ మహనీయుడు కానీ: ప్రశంసిస్తూనే మమత షాక్, పార్టీకి గుడ్బై, ఎందుకంటే?
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తూరులో మరో షాక్ తగిలింది. అంతకుముందు రోజు చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ మరుసటి రోజే పార్టీ నేత మమత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
జగన్కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడి
బోయనపాటి మమత ఎంఆర్పల్లెకు సర్పంచ్గా పని చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉన్నారు. సోమవారం ఆమె తన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో చిత్తూరు వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది.
దేవుడి చేతిలో రాజకీయ భవిష్యత్తు
రాజీనామా సందర్భంగా మమత విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తనకు మరే పార్టీలో చేరే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా, మాజీ సర్పంచ్ హోదాలో తన ప్రజాసేవను కొనసాగిస్తానని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడని తెలిపారు.
జగన్ మహనీయుడు, కానీ అందువల్లే మనస్తాపం
తన రాజకీయ భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని చెబుతూ మమత భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మహనీయుడు అని కితాబిచ్చారు. ఆయనపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని తెలిపారు. అయితే తిరుపతి నగర పార్టీ కార్యాలయం నుంచి సరైన ప్రోత్సాహం లేదని, అది తనను మనస్తాపానికి గురి చేసిందని చెప్పారు.
అందుకే వైసీపీలో చేరా కానీ
స్థానిక శ్రేణుల్లో వర్గ వైషమ్యాలు ఎక్కువ కావడంతో మరో మార్గం లేక పార్టీని అయిష్టంగా వీడాల్సి వస్తోందని మమత చెప్పారు. తాను నవంబర్ 30వ తేదీనే తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించానని చెప్పారు. వ్యక్తిగతంగా కన్నా పార్టీ బలంతో మెరుగైన సేవ చేయవచ్చునని భావించి రెండేళ్ల క్రితం వైసీపీలో చేరానని చెప్పారు.
నేను ఒంటరిగా వెళ్లా
పార్టీ తరఫున ఎవరూ కలిసి రావడం లేదని మమత వాపోయారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చినప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు తాను ఒంటరిగా బాధితులకు సాయం చేశానని, పార్టీ తరఫున ఎవరూ తనతో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.