దారుణం: ఆస్తి కోసం తల్లిదండ్రులను సజీవ దహనం చేశాడు
కృష్ణా: గురువారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా నూజివీడు మండలం పొతిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతకుడు ఆస్తికోసం తన తల్లిదండ్రులను సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో అతడు కూడా గాయపడ్డాడు. కాగా, స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన శోభనాచలం(60), మాణిక్యమ్మ(55)లు భార్యాభర్తలు. అయితే గత కొంతకాలం నుంచి వీరి కుమారుడు ఏడుకొండలు(25) ఆస్తికోసం తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు.
తనకు ఆస్తి దక్కదేమోనన్న అనుమానంతో తల్లిదండ్రులను ఇంట్లో బంధించి, ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని శోభనాచలం, మాణిక్యమ్మ దంపతులు సజీవదహనం అయ్యారు. వీరి కుమారుడు ఏడుకొండలు కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన అతనిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాళెంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. నాయుడుపాళెం గ్రామానికి చెందిన జంపాల మల్లికార్జున బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకూ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
వేకువ జామున ఇంటికి వచ్చిన భర్తను ప్రశ్నించిన భార్య ఈశ్వరమ్మ (35)ను రోకలిబండతో తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలిసిన వెంటనే కొడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మల్లికార్జున పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.