తనను తిట్టాడని.. అశ్లీలంగా బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్
హైదరాబాద్: బాస్ తనను తిట్టాడనే కోపంతో అతని భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించి కంపెనీలోని ఉద్యోగులందరికీ పోస్ట్ చేసిన మాజీ ఉద్యోగిని సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసిపి ఎస్ జయరాం తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్(49) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగి.
విధులకు తరచుగా ఆలస్యంగా వస్తుండటంతో అతని బాస్(ఉన్నతాధికారి) ఒకరు తీవ్రంగా మందలించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీధర్.. బాస్ సతీమణి ఫొటోను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించాడు. ఆ ఫొటోలను కంపెనీలోని ఇతర ఉద్యోగులందరికీ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నాలాలో పడి మహిళ మృతి
చెత్తవేయడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. ఈ ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఫిలింగనర్లోని మహాత్మాగాంధీ నగర్కు చెందిన జి. ద్వారకాబాయి(40) బుధవారం ఇంట్లోని చెత్తను నాలాలో వేసేందుకు వెళ్లింది.
ఈ ఓపెన్ నాలాకు ఎటువంటి రక్షణ గోడ లేకపోవడంతో ద్వారకాబాయి ప్రమాదవశాత్తు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. చెత్తను పడేయడానికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆమె భర్త గంగారం బస్తీ అంతా వెతికి, మధ్యాహ్నం నాలాలో ఉన్న మృతదేహాన్ని గుర్తించాడు.