షాపు తొలగింపు, మనస్తాపం: టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అమలాపురం: అనుమతి లేదంటూ అధికారులు తన షాప్ను తొలగించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లలోకి వెళితే... అమలాపురంలో ఇటీవల యరమంతన దగ్గర ఆక్రమణలను అధికారులు తొలగించారు.
ఆక్రమణల్లో భాగంగా సింహాద్రి శేఖర్ అనే వ్యక్తికి చెందిన నిచ్చెనల కొట్టును కూడా అధికారులు తొలగించారు. దీంతో ఉపాధి కోల్పోయిన సింహాద్రి శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీంతో అక్కడున్న స్థానికులు సింహాద్రి శేఖర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సింహాద్రి శేఖర్ శరీరం నలభై శాతం వరకు కాలిపోయినట్లు చికిత్సనందిస్తున్న వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆనందరావు ఆసుపత్రికి చేరుకుని సింహాద్రి శేఖర్ను పరామర్శించారు.
బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చాడు. కాగా, సింహాద్రి శేఖర్ భార్య మీడియాతో మాట్లాడుతూ తమ షాప్ పోయినందుకు బాధ లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే, హోం మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం చూస్తాం అని చెప్పారే కానీ తమకు న్యాయం చేయలేదని ఆవేదన చెందారు.