ప్రేమ పెళ్లి చేసుకుని కాపురం చేసి వదిలేశాడు
చిత్తూరు: ప్రేమించానని నమ్మించి, పెళ్లి చేసుకుని, కొంత కాలం కాపురం చేసి ఓ వ్యక్తి ఓ వికలాంగురాలిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన వెంకట్రమణ కుమార్తె గంగాదేవి(25) వికలాంగురాలు. మూడేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ అపరేటర్గా పనిచేస్తోంది. పలమనేరు మండలం జీడిమెట్లకు చెందిన రెడ్డెప్పరెడ్డి అక్కడే పనిచేసేవాడు.
ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. మాయమాటలకు చెప్పిన రెడ్డెప్ప రెడ్డికి తన తల్లిదండ్రుల పేర బ్యాంకులో డిపాజిట్ చేసిన 2లక్షలు, నెల నెలా వచ్చే రూ. 10వేలను అతనికే ఇచ్చేది. ఈ ఏడాది జూన్ 18న చిప్పిలిలోని దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగు నెలలు కలసి కాపురం చేశారు. తరువాత ఆమె వలన ఇంక ఆదాయం లేదని తెలుసుకున్న రెడ్డెప్ప రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు గంగాదేవిని వదిలించుకోవాలని అనుకున్నారు.
పథకం ప్రకారం కొడుకు, కోడలిని నెల రోజుల క్రితం రెడ్డెప్పరెడ్డి తల్లిదండ్రులు అత్తారింటికి పంపారు. పనిమీద బెంగళూరుకు వెళుతున్నానని చెప్పిన రెడ్డెప్ప రెడ్డి రెండు మూడు వారాలు గడిచినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ చేసేశాడు. అత్తారింటికి ఫోన్చేస్తే తమకు తెలియదని సమాధానం ఎదురయ్యింది.
తాను మోసపోయానని తెలుసుకున్న గంగాదేవి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఉన్నదంతా భర్తకే ఊడ్చిపెట్టానని, వికలాంగురాలినైన తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.