నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త... ప్రియుడితో సహజీవనం.. విడాకులకు సిద్దపడటంతో..
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనతో తెగదెంపులకు సిద్దమైందన్న కారణంతో ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కొన్ని నెలల నుంచే విబేధాలు మొదలయ్యాయి. దీంతో భార్య భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు మొదటి భర్తతో విడాకులకు సిద్దపడింది. ఈ నేపథ్యంలోనే మొదటి భర్త ఆమెను దారుణంగా నరికి చంపేశాడు.
అలా వివాదం మొదలైంది...
పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన బేతిన చంద్రిక(24),చిలకంపాడుకు చెందిన దువ్వారపు చంటి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. కొన్ని నెలల క్రితం ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుక్కోవాలనుకుని భావించారు. ఇందుకోసం చంద్రిక తల్లిదండ్రులు రూ.5లక్షలు అల్లుడు చంటికి ఇచ్చారు. ఆ రూ.5లక్షలు తీసుకున్నప్పటి నుంచి చంద్రిక-చంటిల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ప్రియుడితో సహజీవనం..
భర్తతో విభేదాల కారణంగా గత ఆర్నెళ్లుగా చంద్రిక చంటికి దూరంగా ఉంటోంది. ఇదే క్రమంలో ఉంగుటూరు మండలం గొల్లగూడెంకి చెందిన కొమ్ము జెల్సీతో చంద్రికకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజులుగా చంద్రిక చంటితోనే సహజీవనం చేస్తోంది. భర్తతో విభేదాల నేపథ్యంలో అతని నుంచి విడాకులు తీసుకుని జెల్సీని పెళ్లి చేసుకోవాలనుకుంది. మరోవైపు ఈ విషయం తెలిసి చంటి ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను మట్టుపెట్టాలనుకున్నాడు.
నడిరోడ్డుపై హత్య...
శుక్రవారం(డిసెంబర్ 18) ప్రియుడు జెల్సీతో కలిసి చంద్రిక గణపవరం పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. విడాకుల కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... మార్గమధ్యలోనే చంటి ఆమెపై దాడి చేశాడు. జట్లపాలెం సమీపంలో అప్పటికే మాటు వేసిన చంటి... మరో ఇద్దరితో కలిసి చంద్రికపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం చంటి అక్కడినుంచి పరారయ్యాడు.ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు.