అన్న అని కూడా చూడలేదు..: చిన్న కారణానికే దారుణ హత్య
కర్నూలు: జిల్లాలోని కోవెలకుంట్లో దారుణం జరిగింది. బైక్ ఇవ్వలేదన్న కారణంతో అన్ననే కడతేర్చాడో యువకుడు. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలానికి చెందిన ఎద్దుల రాజు (21), ఎద్దుల శ్రావణ్ (20)లు అన్నదమ్ముల కుమారులు. రాజు చిన్నతనంలోనే అతని అమ్మ-నాన్న మృతి చెందారు. దీంతో అక్క భారతి, చెల్లెలు వసంతతో కలిసి కౌలూరులో కొన్నాళ్లు ఉన్నారు.
మూడేళ్ల క్రితం జోలదరాశి గ్రామానికి వచ్చి పెద్దనాన్న కుమారుడైన శ్రావణ్(20)తో కలిసి ఉంటున్నారు. ఇతని తల్లిదండ్రులు నంద్యాలలో కూలి పనులు చేస్తుంటారు. కాగా, రాజు ఇటీవల ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి.. పని నిమిత్తం బయటకు వెళ్లాలని బైక్ అడిగాడు శ్రావణ్. కొంత డబ్బు కూడా ఇవ్వాలన్నాడు.
కానీ శ్రావణ్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో పీకలదాకా తాగి వచ్చిన శ్రావణ్.. రాజుపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం విషయాన్ని బంధువులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రావణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.