వివాహేతర సంబంధం: భార్యను కత్తితో నరికి చంపిన భర్త
అమరావతి: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సొంత అన్నను నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, జిల్లాలోని కమ్మదూరలో మంగళవారం మధ్యాహ్నాం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గిరిధర్, శంకరమ్మలు కమ్మదూరలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అన్న వన్నూరు స్వామితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం గిరిధర్కు మనసులో బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భార్య శంకరమ్మ, అన్న వన్నూరు స్వామిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వన్నూరు స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె పరిస్థితి విషమించి మరణించింది. స్థానికులు వెంటనే జరిగిన ఘోరాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విజయనగరం జిల్లా భోగాపురంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భోగాపురం మండలం మహారాజుపేట పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.