మామను అమ్ములతో పొడిచి చంపిన అల్లుడు: భార్యను పంపలేదని...
భార్యను తనతో పంపించలేదనే కోపంతో ఓ వ్యక్తి తన మామను అమ్ములతో పొడిచి చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
ఒంగోలు: చిన్న కారణంతో ఓ వ్యక్తి తన మామను అమ్ములతో పొడిచి చంపి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లె పంచాయతీలోని ఇందిరానగర్ చెంచు కాలనీలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
చెంచు కాలనీకి చెందిన పులసల వెంకటేశ్వర్లు తన కూతురు గురవమ్మను దోర్నాల మండలం కోడపోలు గ్రామానికి చెందిన ఉడతల గురవన్నకిచ్చి ఏడాది కిందట పెళ్లి చేశాడు. గురవమ్మ కాన్పుకోసం గత 20 రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త గురవన్న కూడా ఆమెతోపాటు ఇక్కడే ఉంటున్నాడు.
పదిరోజుల కిందట గురవమ్మ మగ బిడ్డకు కన్నది తన భార్యపిల్లలను తనతోపాటు తన గ్రామానికి పంపాలని ప్రతి రోజూ గురవన్న పట్టుబడుతూ వచ్చాడు. దీంతో గొడవ చోటు చేసుకుంది. బాలింతైన ఆమెను మరో 10 రోజుల తరువాత పంపుతానని అతడు మామ చెప్పాడు. అయినా అతను వినలేదు. బుధవారం గురవన్న మద్యం తాగి వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ప్రారంభమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది.
గురవన్న ఇంటిలో ఉన్న అమ్ములను తీసుకొచ్చి మామమీదికి విసిరాడు. వెంకటేశ్వర్ల గొంతుకు అది గుచ్చుకొవడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. దీంతో భయందోళన చెందిన గురవన్న తనవద్ద ఉన్న అమ్ములను తీసుకొని తన కడుపులో పొడుచుకున్నాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ని 108 వాహనం ద్వారా కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించగా గురువారం ఉదయం గురవన్న మృతిచెందారు. అర్ధవీడు ఎస్ఐ కోటయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.