ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మాలనుకున్నాడు.. ఓటీపీ చెప్పి రూ.60వేలు పోగొట్టుకున్నాడు..
రాజమహేంద్రవరం : ఆన్లైన్ మోసాలకు అడ్డు అదుపూలేకుండాపోతోంది. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. బాధితులకు తెలియకుండానే వారి అకౌంట్లలోని డబ్బులు కొట్టేస్తూ జల్సాలు చేస్తున్నారు. మోసపోయిన విషయం తెలిసి బాదితులు పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓఎల్ఎక్స్లో సోఫా కొంటానంటూ ఓ కేటుగాడు రూ.60వేలు కొట్టేశాడు.
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి సోఫా
రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని లాలా చెరువు ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ ఓఎల్ఎక్స్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టాడు. దాన్ని చూసిన ఓ వ్యక్తి కొంటానంటూ ఆన్లైన్ చాటింగ్కు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నాక బేరం కుదరడంతో అరుణ్ అతనికి సోఫా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఎదుటి వ్యక్తి ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో అరుణ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు.
ఓటీపీ నెంబర్ తీసుకుని
బ్యాంక్ అకౌంట్ వివరాలు అందగానే కేటుగాడు తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. తొలుత తన అకౌంట్కు రూ.100 పంపించాలని అవతలి వ్యక్తి చెప్పడంతో అరుణ్ అలాగే చేశారు. ఆ తర్వాత కాసేపటికి మీ అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం లేదని చెప్పడంతో అరుణ్ తన ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. మరికాసేపటికి మళ్లీ కాల్ చేసిన ఆ మోసగాడు మీ అకౌంట్కే డబ్బు పంపుతానని, ఫోన్కు వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలని కోరాడు. దీంతో అరుణ్ ఓటీపీ చెప్పాడు.ఇంకేముందు క్షణాల్లో అతని అకౌంట్లో రూ.50 వేలు మాయం అయ్యాయి. అంతకు ముందే తన ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఆ కేటుగాడు రూ.10వేలు కొట్టేశాడు.
పోలీసులకు ఫిర్యాదు
ఆన్లైన్లో రూ.60వేలు పోగొట్టుకున్న అరుణ్ చివరకు జరిగిన మోసం గ్రహించాడు. త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకింగ్, ఆన్లైన్ మోసాల గురించి ఎన్ని వార్తలు వస్తున్నా ఇప్పటికీ చదువుకున్న వారు సైతం కేటుగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అందుకే ఆన్లైన్ వ్యవహరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.