వీడు మనిషి కాదు: సొంత భార్యనే అన్నకు అమ్మేసిన దుర్మార్గుడు
ఆంధ్రప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఓ ప్రబుద్ధుడు సొంత భార్యా పిల్లలను అమ్మకానికి పెట్టాడు. సొంత అన్నకే తన భార్యను అమ్మే ప్రయత్నం చేశాడు దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా కోవెలకుంట్ల బుడజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి అనే వ్యక్తికి నంద్యాలకు చెందిన వెంకటమ్మ అనే మహిళతో 10ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు.
మద్దిలేటి మద్యానికి బానిసై ఊర్లో రూ.15 లక్షలు అప్పుచేశాడు. ఇక ఈ అప్పు తీర్చేందుకు 13ఏళ్లున్న తన రెండో కుమార్తెను రూ.1.5 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మినట్లు భార్య వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్న అన్నకు వెంకటమ్మను రూ.5 లక్షలకు తాకట్టుపెడుతున్నాడన్న సంగతి తెలుసుకున్న ఆమె... నంద్యాలలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
తల్లి దగ్గర ఉంటున్నప్పటికీ... వెంకటమ్మను మద్దిలేటి పిల్లలను పంపించాల్సిందిగా వేధించసాగాడు. దీంతో వెంకటమ్మ ఐసీడీఎస్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజెల్, పిల్లల సంరక్షణ అధికారి శారదకు విషయం తెలిపింది. బాధితురాలినుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.