నమ్మి పంపిస్తే కాటేశాడు... బాలికకు నరకం,పలుమార్లు అత్యాచారం... ప్రకాశంలో వెలుగుచూసిన దారుణం
కూతురు కూడా పనిచేస్తే తమకు చేదోడు వాదోడుగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. ఎక్కడికో ఎందుకు తెలిసినవాళ్ల వద్దే పనిలో పెట్టాలనుకున్నారు. తమకు పరిచయం ఉన్న ఓ దంపతుల వద్ద కూతురిని పనిలో కుదిర్చారు. కానీ,తెలిసినవాళ్లే కదా బిడ్డ క్షేమంగా ఉంటుందన్న తల్లిదండ్రుల నమ్మకం వమ్మయింది. సదరు వ్యక్తి ఆమెపై పలుమార్లు బలత్కారం చేయగా... అందుకు అతని భార్య కూడా సహకరించింది. ఇటీవల బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంకి చెందిన ఓ కూలీ దంపతులు కొంతకాలంగా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారు. దీంతో తమ 15 ఏళ్ల కుమార్తెని కూడా ఏదైనా పనిలో పెట్టాలనుకున్నారు. తెలిసినవాళ్ల వద్ద అయితే బిడ్డ క్షేమంగా ఉంటుందని... సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్లో నివాసముండే యుగంధర్-నాగమణి దంపతుల వద్ద పనికి కుదిర్చారు. ఈ దంపతులు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంట సోఫాలు,కుర్చీలు ఇతరత్రా ఫర్నీచర్ విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. స్వగ్రామంలో వీరికి బాతు గుడ్ల వ్యాపారం కూడా ఉంది.
బాలికను ఢిల్లీ తీసుకెళ్లి...
బాలికను పనిలో పెట్టుకున్న యుగంధర్ దంపతులు ఈ ఏడాది జనవరిలో తమతో పాటు ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి బాలికకు నరకం చూపించడం మొదలుపెట్టారు. దాదాపు 3 నెలలు బాలికను బెదిరింపులకు గురిచేసి యుగంధర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు మత్తు మందు ఇచ్చి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు భార్య నాగమణి కూడా అతనికి సహకరించేది. ఇదే క్రమంలో ఈ ఏడాది మే నెలలో వారు బాలికను తీసుకుని బాలిరెడ్డినగర్లోని తమ స్వగృహానికి వచ్చారు. జులై 26న బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారు.
ఐదు నెలల గర్భిణి..
బాలికను ఆమె ఇంటికి పంపించాక కూడా... పలుమార్లు తన వద్దకు పిలిపించుకుని యుగంధర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం బాలికను బైక్పై ఎక్కించుకుని పామూరు వెళ్లిన యుగంధర్... తిరుగు ప్రయాణంలో ఓచోట ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను తిరిగి ఆమె ఇంటికి పంపించగా.... తల్లిదండ్రులు ఆమె శరీరంలో మార్పులను గమనించారు. అగస్టు 29న కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా... ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది.
Recommended Video
కేసు నమోదు...
బాలికను తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆ దంపతులు సోమవారం(అగస్టు 31) ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే గ్రీవెన్స్ సెల్ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వలేటివారిపాలెం పోలీసులను ఆశ్రయించారు. అక్కడి పోలీసులు డీఎస్పీకి విషయం చేరవేయడంతో సింగరాయకొండలో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.