కన్నా ర్యాలీలో ‘ప్రత్యేక హోదా’ ప్లకార్డు: ఆ ఆర్ఎంపీని చితకబాదారు
ప్రకాశం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం ఒంగోలు పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి, తదితర నేతలు ర్యాలీగా వచ్చారు.
ముఖ్య నేతలు ఓపెన్ టాప్ జీపులలో ఉండగా, వీరి వాహనాల ముందు, వెనుకాల మోటార్ సైకిళ్లపై కార్యకర్తలు, నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ర్యాలీ కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే.. శ్రీనివాసరావు అనే ఆర్ఎంపీ 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి' అని రాసివున్న ప్లకార్డుతో అక్కడికి వచ్చాడు.
ఆ కార్డును ప్రదర్శిస్తున్న శ్రీనివాసరావుపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. వెంటపడి తన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాసరావును అక్కడ్నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.
సాయంత్రం వరకు పోలీసులు అతడ్ని తమ రక్షణలో ఉంచుకున్నారు. కాగా, శ్రీనివాసరావు గత కొంతకాలం క్రితం వరకు టీడీపీ కార్యకర్తగా కొనసాగారు. ఇది ఇలా ఉంటే, శ్రీనివాసరావుపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.