తాగిన మత్తులో కన్నతల్లిపై కుమారుడి అత్యాచారం
చిత్తూరు: మద్యం మత్తులో తల్లిపైనే ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ చర్యతో తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ సంఘటన జరిగింది. మదనపల్లెలోని విజయ్ నగర్ కాలనీకి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఆ మహిళ భర్త 24 కిందట మరణించాడు. పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత పిల్లలు ఆమెను పట్టించుకోలేదు. అదే కాలనీలో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పాచిపనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె చిన్న కుమారుడు వెంకటాచలపతి మద్యం మత్తులో శనివారం రాత్రి సమయంలో తల్లి ఇంటికి వెళ్లాడు.
అయితే, మర్నాడు ఉదయం స్థానికులు చూసేసరికి ఆ మహిళ ఒంటిపై నూలు పోగు కూడా లేదు. పలు చోట్ల పంటిగాట్లు ఉన్నాయి. రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉింది. స్థానికులు ఆమెకు దుస్తులు తొడిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు.
ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. తమకేమీ తెలియదని వారు చెప్పారు. వెంకటాచలపతి తరుచుగా మద్యం సేవించి వచ్చి డబ్బుల కోసం తల్లితో గొడవ పడేవాడని, అంతకు మించి ఆ ఇంట్లో ఎవరూ లేరని స్థానికులు చెప్పారు.
శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో వచ్చిన అతడు అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు ఇంట్లో ఉండి తల్లితో గొడవ పడడం తాము గమనించామని స్థానికులు చెప్పారు. రాత్రి పరారైన వెంకటాచలపతిని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.