భార్య పుట్టింటికి వెళ్ళిందని, వాట్సాప్ లో మేసేజ్ పెట్టి ఇలా...
పుట్టింటికి వెళ్ళిన భార్య రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకొంది.
తిరుపతి:పుట్టింటికి వెళ్ళిన భార్య ఇంతవరకు తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ భర్త ప్రేమికుల దినోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొంటున్న విషయాన్నే ముందుగానే ఆయన వాట్సాప్ లో మేసేజ్ చేశాడు.ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకొంది.
తిరుపతిలోని ఎస్ వి యూనివర్శిటీలోని విసి చాంబర్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న శ్రీహరి 2006 లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరాడు. బీటెక్ చదివిన శ్రీహరికి కంప్యూటర్ మీద మంచి పట్టుంది.2015 అక్టోబర్ లో వీసి దామోదరం పీఏ గా నియమించుకొన్నారు.
శ్రీహరికి ఆరేళ్ళ క్రితం నెల్లూరుకు చెందిన విద్యాలతతో వివాహమైంది. కొంతకాలం తిరుపతిలోని ఎస్ వి నగర్ లో నివాసం ఉండేవారు. వీసీ పిఏ గా నియమితులయ్యాక నివాసాన్ని రెడ్ బిల్డింగ్ క్వార్టర్స్ లోని హౌజ్ నెంబర్ 42 కు షిఫ్ట్ అయ్యారు.
పెళ్ళి ఆరేళ్ళయింది.అయినా పిల్లలు కాలేదు శ్రీహరి దంపతులకు. దీంతో నిత్యం భార్య, భర్తలు గొడవ పడేవారని శ్రీహరి సన్నిహితులు చెబుతున్నారు.ఈ గొడవల కారణంగానే విద్యాలత ఆరు మాసాల క్రితం పుట్టింటికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు.
ఆ రోజు నుండి శ్రీహరి మనోవేదన చెందుతున్నారు.దీంతో వాలంటైన్స్ డే రోజున ఆత్మహత్య చేసుకోవాలని శ్రీహరి నిర్ణయించుకొన్నాడు.
వాట్సాప్ లో డిస్ ప్లే పిక్చర్ లో పుట్టిన తేది మరణించిన తేది అని, ఫోటోల మధ్యలో ఉరితాడు పెట్టి పిక్చర్ తయారు చేశాడు. కొంతమంది మిత్రులకు పోస్ట్ చేశాడు. హైద్రాబాద్ లో ఉంటున్న తమ్ముడు , చిన్నాన్నకు మంగళవారం నాడు తిరుపతికి వచ్చేందుకు వీలుగా విమాన టిక్కెట్లను కూడ ఆయన బుక్ చేశాడు.
వాట్సాప్ లో శ్రీహరి పెట్టిన మేసేజ్ కు స్పందించి ఆయన ఇంటికి వచ్చిన ఆయన మిత్రులు షాక్ తిన్నారు.ఉరివేసుకొని శ్రీహరి మృతదేహం వేలాడుతూ కన్పించింది. ఎస్ వి యూనివర్శిటీ వీసీ దామోదరం తదితరులు శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించారు.