పెళ్లిచేసుకుందాం అంది.. అంతే.. ప్రేయసిని నదిలో తోసేశాడు.. తర్వాత ఏమైందంటే..
ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇంకా ఎంతకాలం ఇలా.. పెళ్లిచేసుకుందాం.. అని అడిగిన పాపానికి ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు.
యానాం: ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇంకా ఎంతకాలం ఇలా.. పెళ్లిచేసుకుందాం.. అని అడిగిన పాపానికి ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. ఈ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది.
స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గండి అలివేణి(26) అదే పట్టణానికి చెందిన నాసిక శ్రీనివాస్ అనే యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లిచేసుకోమని అలివేణి ఒత్తిడి చేస్తోంది. దీంతో శ్రీనివాస్ ఆమెను ఆదివారం యానాం తీసుకొచ్చాడు. యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై వారు కొద్దిసేపు గడిపారు.
రాత్రి 2.30 గంటల సమయంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాస్ ఆగ్రహం పట్టలేక ప్రేయసి అలివేణి తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె చరవాణి, హ్యాండ్బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు.
ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు అలివేణిని రక్షించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న యానాం ఎస్సై వి.శివకుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.