కోటి మృతి: హోదా కోసం బలిదానం, చిరంజీవి దిగ్భ్రాంతి, కలతచెందిన శివాజీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పోరుసభ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేసిన మునికోటి (41) ఆదివారం నాడు కన్నుమూశారు.
మెరుగైన చికిత్స కోసం ఆయనను ఉదయం వేలూరు నుంచి చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ పోరుసభ జరుగుతున్న ప్రాంగణంలో ముని కామకోటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అరుస్తూ ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని పరుగులు తీశాడు. వెంటనే కామకోటిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీకి తరలించారు. వేలూరు ఆసుపత్రిలో సదుపాయాలు లేక అక్కడి నుంచి చెన్నైలోని కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలో చికిత్స పొందుతూ కామకోటి మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
చిరు, రఘువీరా దిగ్భ్రాంతి
మునికోటి మృతి పైన కాంగ్రెస్ పార్టీ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు కూడా ఆత్మహత్య వంటి చర్యలకు పూనుకోవద్దని హితవు పలికారు.
శివాజీ ప్రగాఢ సానుభూతి
మునికోటి మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని సినీ నటుడు శివాజీ ఆదివారం అన్నారు. ఓ అమరుడా! నీ త్యాగం ఊరికే పోదు... నీ మరణం లక్షలాది మందిలో కొత్త ఉద్యమానికి ఊపిరులూదుతుందన్నారు.
కేంద్రం మెడలు వంచి హోదాను సాధించుకుంటామన్నారు. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడ వద్దన్నారు. పోరాడి హక్కులను సాధించుకుందామన్నారు. కోటి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.