ఎటిఎం చోరీ: విలాసాలకు మరిగి, రూ. 25 వేలకు తుపాకి కొని...
హైదరాబాద్: హైదరాబాద్ యూసుఫ్గూడ ఎస్బీఐ ఏటీఎంలో కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చిన శివకుమార్ రెడ్డి అనే యువకుడు విలాసాలకు మరిగి దోపిడీలకు పాల్పడ్డాడు. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. యువతిని భయపెట్టేందుకు తుపాకితో పక్కకు కాల్సాడని ఆయన చెప్పారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని కడప జిల్లా వల్లు గ్రామానికి చెందిన శివకుమార్రెడ్డిగా గుర్తించారు. అతని నుంచి ఒక నాటు తుపాకీ, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం యూసుఫ్గూడలోని శ్రీలత అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిణిని నగదు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లింది. ఆమె డబ్బు డ్రా చేస్తుండగా శివకుమార్ ఏటీఎంలోకి వెళ్లాడు.
తుపాకీ చూపించి నగదు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. కాల్పులు జరిపాడు. ఆమె నుంచి కార్డు, పిన్ నెంబర్ కూడా తీసుకుని పరారయ్యాడు. సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు గురువారం అమీర్పేట్లో అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను నగర సీపీ మహేందర్రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పదోతరగతి ఫెయిల్ అయిన శివకుమార్ మూడేళ్ల క్రితం కడప నుంచి హైదరాబాద్ వచ్చాడని, చెడు వ్యసనాలకు బానిస అయిన ఆయన డబ్బు కోసం నేరాల వృత్తి ఎంచుకున్నాడని తెలిపారు.
ఇందుకోసం మహారాష్ట్ర గ్యాంగ్ వద్ద రూ. 25 వేలకు నాటు తుపాకీని కొనుగోలు చేశాడని, దాని సాయంతోనే ఏటీఎంలో మహిళను బెదిరించాడని కమిషనర్ తెలిపారు. శివకుమార్ చెప్పిన వివరాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఏటీఎం కేసును సీరియస్గా తీసుకుని ఛేదించామని ఆయన అన్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఆయన చెప్పారు.