కేబీఆర్ కాల్పులు: నిందితుడు అరెస్ట్, ఇలా దొరికాడు...
హైదరాబాద్: అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన కేసును పోలీసులు ఒక్కరోజులోనే చేధించారు. కాల్పులు జరిపింది ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓబులేష్తో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని ఇవాళ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఓబులేష్ గత మార్చి నుండి అంబర్ పేట పీఎస్లో పని చేస్తున్నాడు.
ఓబులేష్ మరో ముగ్గురితో కలిసి స్కెచ్ వేశాడు. నిత్యానంద రెడ్డిని కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యుల నుండి భారీగా డబ్బులు తీసుకుందామని భావించాడంట. ఓబులేష్ను గుత్తిలో అరెస్టు చేశారు. సుంకులమ్మ ఆలయ సమీపంలో అతను పట్టుబడ్డాడు. ఓబులేష్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలో కర్నూలులో పని చేశాడు. గ్రేహౌండ్స్లో పని చేశాడు. వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తుండగా ఆయుధం అదృశ్యమైంది. అతనే తనకు తెలిసిన వారికి ఆయుధం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతనిని పోలీసులు హైదరాబాద్ తీసుకు వస్తున్నారు.
అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. అయితే, కాల్పుల కేసులో కానిస్టేబుల్ ఓబులేసును అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తలను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం ఉదయం ఖండించారు.
కాగా, బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ వద్ద కారులోకి ఎక్కిన నిత్యానంద రెడ్డితో పాటు అగంతకుడు ఎక్కి అతనిని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెనుగాలట, కాల్పులు జరిగాయి. నిత్యానంద సోదరుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేసి, కేసును చేధించారు.
ఘటన ప్రాంతంలోనే ఆధారాలు
దుండగుడు చాలా ఆధారాలను కారులోనే వదిలేశాడు. అవి తాను కిడ్నాప్ కోసం వాడిన ఏకే 47 రైఫిల్, కొత్తగా కొనుకున్న ఒక కొత్త జీన్స్ ప్యాంట్, దాని తాలూకు బిల్లు, వీటితో పోలీసుల పని సులువయింది.
బట్టల షోరూంలో..
బిల్లును పట్టుకుని కొత్త జీన్స్ప్యాంటుతో సహా పోలీసులు చందనా బ్రదర్స్కు చేరుకున్నారు. జీన్స్ ప్యాంట్పై ఉన్న బార్కోడ్ ట్యాగ్ ఆధారంగా ఆ ప్యాంట్ను ఏ సమయంలో కొన్నారో తెలుసుకున్నారు. ఆ సమయానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు. ఆ దృశ్యాలను నిత్యానంద్కు చూపించారు. దుండగుడెవరో ఇట్టే తెలిసిపోయింది.
దాని ఆధారంగా పోలీసులు బుధవారం రాత్రికే దుండగుడికి చెందిన స్పష్టమైన ఊహాచిత్రం కూడా విడుదల చేశారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ తమపని తాము పూర్తి చేయగా ఆగంతకుడిని పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్, ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
40 నిమిషాలు వేచి చూసి...
కేబీఆర్ పార్కు వద్ద తన టార్గెట్ కోసం దుండగుడు చాలా ఓపిగ్గా ఎదురు చూసినట్లు తెలుస్తోంది. నిత్యానంద రెడ్డి కారు ఆపిన చోటుకు అతను 20 అడుగుల దూరంలోనే అతను బైఠాయించాడు. తెలుపు రంగు చొక్కా, ఎరుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించాడు. ఏకే-47 బయటికి కనిపించకుండా లుంగీలో చుట్టి సంచిలో పెట్టేశాడు.
సంఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, పశ్చిమ మండలం ఉపకమిషనర్ ఎ వెంటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం నిత్యానందరెడ్డి ఇంటికి కమిషనర్ వెళ్లి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనను మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పరామర్శించారు.