భార్య అలా ప్రచారం చేయడంతో..: పిడుగురాళ్లలో యువకుడి ఆత్మహత్య
పిడుగురాళ్ల: తమకు పిల్లలు పుట్టరని భార్య అందరికీ ప్రచారం చేస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. పిడుగురాళ్ల పట్టణంలోని రావెళ్ల హోటల్ బజారులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పిడుగురాళ్లలో పీడబ్ల్యూడీ కాలనీలో భార్య భవానీతో కలిసి కేతరాజుపల్లి వెంకటేశ్వర్లు(23) కాపురం ఉంటున్నాడు. ఇతని స్వగ్రామం నుదురుపాడు కాగా.. ఉపాధి కోసం పిడుగురాళ్లకి వచ్చి స్థిరపడ్డాడు. తమకు పిల్లలు పుట్టరని ఇటీవల తన భార్య చుట్టుపక్కల వారికి ప్రచారం చేస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
ఈ నేపథ్యంలోనే రావెళ్ల హోటల్ పక్కవీధిలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వెళ్లి శుక్రవారం ఉరివేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రవీంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని భార్య, తల్లిదండ్రులకు ఫోన్ సమాచారం ఇచ్చి వారిని కూడా రప్పించారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.