కలానికి కాదు, కులానికి సంకెళ్లు: ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని
కలానికి కాదు కులానికి, తప్పుడు వార్తలు రాసేవారికి సంకెళ్లు అని ఏపీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని స్పష్టంచేశారు. ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై మీడియా సంస్థలు గగ్గొలు పెట్టడంతో మంత్రుల స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారమే ప్రతికలపై నియంత్రణ ఉంటుందని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. అంతేతప్ప తమ సొంత ప్రయోజనాల కోసం జీవోలు తీసుకురాలేదని తేల్చిచెప్పారు.
వంశీ నివాసానికి నాని ద్వయం: వారిచ్చిన హామీ ఏంటి: ఏం జరుగుతోంది..!
కలానికి కాదు..
ఇటీవల కలానికి సంకెళ్లు, ప్రతికా స్వేచ్చకు కళ్లెం అని శీర్షిక ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన 19(ఏ) జీవోతో పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగించబోదన్నారు. జర్నలిస్టుల స్వేచ్చకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వంపై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను ప్రచురించాలని జీవో చెబుతుందని గుర్తుచేశారు. సంబంధిత శాఖ కార్యదర్శి వివరణ ప్రచురించకుంటే కోర్టును ఆశ్రయించేందుకు కూడా అనుమతించామని పేర్ని నాని తెలిపారు.
తామే సుప్రీం అనే భావనలో..
ఆయా పత్రికల్లో ఏ వార్త ఎక్కడ రాయాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశమని పేర్ని నాని తెలిపారు. కొన్ని సార్లు ఆయా పత్రికలు సమాధానం (రీజాయిండర్) ఇవ్వకుండే ఏం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతమైన స్థానంలో ఉన్నామనే భావనలో ఉన్నాయని చెప్పారు. జాతీయ మీడియాకు రాష్ట్రంలోని మీడియాకు సంబంధం లేదన్నారు. ఇక్కడి మీడియాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. మీడియా తీరును ప్రజలు గమనించాలని కోరారు.
బాబే సీఎంగా ఉండాలా ?
కలానికి కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో కొన్ని పత్రిక యాజమాన్యాలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తమ కులమే రాజ్యాధికారం చెలాయించాలనే భావనలో ఉన్నాయని గుర్తుచేశారు. మా కులమే ఉండాలి.. చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉండాలనే వారికి మాత్రమే సంకెళ్లు అని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని మిగతా మీడియా అధిపతులు, ప్రజలు గమనించాలని కోరారు. నీతి, నిజాయితీగా ఉండే పత్రికలు, జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టంచేశారు.
నోటీసులు.. కోర్టుకు
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలులో అప్పటి ఎండీ సురేంద్రబాబు సహకరించలేదని ప్రభుత్వం బదిలీ చేసిందని తప్పుడు వార్త రాశారని కొడాలి నాని గుర్తుచేశారు. దీనిపై రవాణాశాఖ కార్యదర్శి, సురేంద్రబాబు రీజాయిండర్ ఇచ్చినా ప్రచురించలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. అందుకోసమే జీవో తీసుకొచ్చామని గుర్తుచేశారు. రీజాయిండర్ తీసుకోకున్నా, తప్పుడు వార్త రాసినా.. కోర్టులకు వెళ్లేందుకు కార్యదర్శులకు అనుమతి ఇచ్చామని తెలిపారు.