వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు కిడ్నీరాకెట్లో అనూహ్య మలుపులు...అందరూ బిగ్ షాట్లే!...అసలు దోషులెవరు?...

|
Google Oneindia TeluguNews

గుంటూరు : గుంటూరు జిల్లా కిడ్నీ రాకెట్‌ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో లోతుగా వెళ్లేకొద్దీ ఊహించని విషయాలు బైటపడుతున్నాయి. ఈ కిడ్నీల బిజినెస్ ఎంతకాలంగా జరుగుతుందో తెలియదుకానీ ఇందులో సూత్రధారులు, పాత్రధారులుగా వినిపిస్తున్న పేర్లన్నీ బిగ్ షాట్లవే కావడం సంచలనం సృష్టిస్తోంది.

ఇంతకీ గుంటూరు-నర్సరావుపేట కిడ్నీ రాకెట్ లో అసలు దొంగలెవరు? ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని పరిశీలిస్తే నిరుపేదల పేదరికాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని వారిని మాయమాటలతో మోసపుచ్చి అతి చవకగా వారి కిడ్నీలను కొట్టేస్తూ లక్షలు గడిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణానికి, నీచానికి ఒడిగడుతున్నవారు, అందుకు సహకరిస్తున్నవారు అందరూ సమాజంలో ప్రముఖ నాయకులు, అధికారులు, ఉన్నత విద్యావంతులు కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

 ఇంత దారుణమా?....

ఇంత దారుణమా?....

గుంటూరు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్లో ప్రముఖ బంగారం వ్యాపారి, రాష్ట్ర బులియన్‌ మర్చంట్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు, టిడిపి నాయకుడు కపిలవాయి విజయకుమార్‌ పాత్రధారిగా ఉన్నట్లు ప్రాధమిక విచారణలో తేలడం సంచలనం సృష్టిస్తోంది. ఇక బాధితులంతా తండాల్లోని గిరిజనులే. మారుమూల గ్రామాలు, తండాలలోని గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతే పెట్టుబడిగా వారి కిడ్నీలతో వ్యాపారం చేస్తూ తిలా పాపం..తలా పిడికెడు లాగా ఈ కిడ్నీల వ్యాపారంతో ప్రముఖులు, వారి అనుచరులైన మరి కొంత మంది నాయకులు, వారికి సహకరిస్తూ అధికారులు, వైద్యులు ఇలా అందరూ తోడు దొంగలుగా మారి లక్షలు గడిస్తున్నారు.

 ఒకరి మీద ఒకరు...తప్పించుకునేందుకు...

ఒకరి మీద ఒకరు...తప్పించుకునేందుకు...

గుంటూరు-నర్సరావుపేట కేంద్రంగా వెలుగు చూసిన తాజా కిడ్నీ రాకెట్ పెను సంచలనం సృష్టిస్తుండం, పైగా ఈ వ్యవహారంలో అందరూ ప్రముఖుల పేర్లే వెలుగు చూస్తుండటంతో ఎవరికి వారు ఇందులో తమ పాత్రేమీ లేదని, తాము దోషులము కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పి తప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్లో తొలుత గుంటూరు వేదాంత హాస్పిటల్ పేరు రాగా తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన చిగురుపాటి శివనాగేశ్వరరావుకు తాము చికిత్సే చెయ్యలేదని, అతడు విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు కనుక ఈ కిడ్నీ రాకెట్ తో తమకు సంబంధం లేదని వేదాంత హాస్పిటల్ వైద్యుడు చింతా రామకృష్ణ చెబుతున్నారు. అయితే తాము ఈ కిడ్నీ రాకెట్తో సంబంధం లేకుండా తామే సొంతంగా దాతను సమకూర్చుకున్నామని పేషెంట్ శివనాగేశ్వరరావు చెబుతున్నారు. మరోవైపు నర్సరావుపేటలో కిడ్నీమార్పిడి ప్రక్రియకు అనుమతులు ఎమ్మార్వో కార్యాలయం నుంచి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేయగా పోలీసు శాఖ అనుమతి సందర్భంలోనే ఈ వ్యవహారం బైటపడటం గమనార్హం.

 ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

గుంటూరు జిల్లాలోని దుర్గి మండలం ముటుకూరు తండాకు చెందిన మూడావత్‌ వెంకటేశ్వరనాయక్‌కు సంబంధించిన కిడ్నీని తొలగించి గుంటూరుకు చెందిన శివనాగేశ్వరరావుకు అమర్చేంచేందుకు పట్టణానికి చెందిన దళారి రావూరి రవి చౌదరి ఆసుపత్రి వైద్యులతో రూ.లక్షల్లో బేరం కుదుర్చు కున్నట్లు తెలిసింది. అయితే నిబంధనల ప్రకారం కిడ్నీలు దానంగా ఇచ్చే వ్యక్తి సంబంధిత రోగికి బంధువై ఉండాలి. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించాలి. లేదా ఇతరులెవరైనా దానం చేయాల్సి వస్తే జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం పొందాలి. గుంటూరులోని వేదాంత ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివనాగేశ్వరరావుకు తాను బంధువునంటూ, తన కిడ్నీని ఆయనకు దానం ఇచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్‌, రెసిడెన్సీ సర్టిఫికెట్‌ కోసం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో అర్జీ అందజేశారు.

 వైద్యులు...ప్రముఖులు...అధికారులు...

వైద్యులు...ప్రముఖులు...అధికారులు...

ఈ అర్జీని స్థానిక బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్‌ స్వయంగా తహశీల్దార్‌తో ఫోనులో సంప్రదించి డ్రైవర్‌ ద్వారా అందజేసినట్లు తహశీల్దార్‌ విజయజ్యోతికుమారి మీడియాకు చెప్పారు. అయితే గుంటూరులోని వేదాంత ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్‌ చింతా రామకృష్ణకు ఈ కపిలవాయి విజయకుమార్‌కు మామ కావడం గమనార్హం. అయితే తహశీల్దార్‌ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ కోసం అందజేసిన అర్జీలో ఆధార్‌ కార్డులో రావూరి రవిచౌదరి ఫొటోకు బదులు వెంకటేశ్వర్ల నాయక్‌ ఫొటోను మార్పింగ్‌ చేసి పెట్టి అందజేశారు. యథాతథంగా తహశీల్దార్‌ కార్యాలయం వారు ఆ సర్టిఫికెట్‌ను పరిశీలించినట్లు రికార్డుల్లో నమోదు చేసుకొని ధృవపత్రం జారీ చేశారు. అయితే ఈ కిడ్నీమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్లను పోలీసులూ ధ్రువీకరించాల్సి ఉంది.

 పోలీసుల వద్ద...గుట్టురట్టయింది...

పోలీసుల వద్ద...గుట్టురట్టయింది...

రెవెన్యూ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా పనిచేయించుకున్న కిడ్నీ దళారులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ధ్రువీకరణ కోసం వెళ్లారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఆధార్‌ బార్‌ కోడింగ్‌ యాప్‌లో దరఖాస్తుదారుని పేరు, చిరునామాలను పరిశీలించగా అది తప్పుడు ధ్రువీకరణని తేలింది. ఈ విషయాన్ని పోలీసులు తిరిగి తహశీల్దార్‌ కార్యాలయానికి సమాచారం అందించగా ఆత్మరక్షణలో పడ్డ తహశీల్దార్‌ విజయ జ్యోతికుమారి సదరు అర్జీదారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

 ఇప్పటికే...ఇలా...మూడు ఆపరేషన్లు...

ఇప్పటికే...ఇలా...మూడు ఆపరేషన్లు...

అయితే ఇప్పటికే నరసరావుపేట తహశీల్దార్‌ కార్యాలయం నుండి ఇలా జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లతో గుంటూరులోని వేదాంత ఆసుపత్రిలో ముగ్గురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా నరసరావుపేట తహశీల్దార్‌ కార్యాలయం నుండి వరుసగా సర్టిఫికెట్లు జారీ కావడం, వేదాంత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు అసలు ఈ కిడ్నీ రాకెట్ వెలుగు చూడటానికి కారణమైన పేషెంట్ శివనాగేశ్వరరావుకు ఇప్పటికే విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరగగా ఆయనకు బంధువు కాకుండా మరో బయట వ్యక్తి కిడ్నీఅమర్చడం సందేహాలకు తావిస్తోంది.

అసలు దోషులెవరు?...

అసలు దోషులెవరు?...

ఏదేమైనా కేవలం డబ్బు కోసం ఇలా మోసపూరితంగా నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడటం, అది కూడా ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కావడం దిగజారుతున్న మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నప్పుడు ఏమాత్రం భయం లేకుండా నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ఈ వ్యవహారాన్ని నడిపించడమే సమాజపు పోకడలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికైనా పోలీసులు ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారులు,పాత్రధారులను బైటపెట్టి వ్యవస్థ పట్ల కోల్పోతున్న నమ్మకాన్ని కొంతైనా సమాజంలో తిరిగి పాదుకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
More information is emerging over the kidney racket that was busted by Narsaraopet police in Guntur. The managing director of the hospital said that it is true that they had a patient named Siva Nageswar Rao, who needed kidney transplant. But they did not get permission from the hospital committee to perform the surgery, so the patient had left and got it done in some other hospital. Meanwhile, the donor, Venkatestwar Naik told the tahsildar that he had a lot of debts and the patient's relatives promised to help him. However, both Naik and Ravuri Ravi, on whose name the fake Aadhar was prepared, are missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X