నారా లోకేష్తో మంచిరెడ్డి తనయుడి భేటీ: టీడీపిలో ఉంటానని కృష్ణారావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు ప్రశాంత్ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, యువనేత నారా లోకేష్తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భేటీ అయ్యారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి మద్దతుదారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనుకే ఉంటామని పోస్టర్ల ద్వారా మద్దతు తెలిపారు.
అయితే మంచిరెడ్డి టీడీపీ బిడ్డ అని ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది.
ఇదిలావుంటే, తాను పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కూకట్పల్లి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కృష్ణారావు తెలిపారు. టీడీపీలోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో జరగనున్న తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో పాల్గొంటానని కృష్ణారావు చెప్పారు.