చాలా పెద్ద ప్లానే ఉందన్నమంచు లక్ష్మీ.. బీజేపీలో మోహన్ బాబు ఫ్యామిలీ చేరికపై వివరణ..
టాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరిగా పేరుపొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం జగన్ కు దగ్గరి బంధువులైన మంచు కుటుంబం.. వైసీపీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు అన్ని చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ప్రధానిని కలిసినవారిలో మోహన్ బాబు, లక్ష్మీతోపాటు మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికా రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారడంపై, అసలు ప్రధాని మోదీని కలవడానికి గల కారణాలపై మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సమగ్ర వివరణ ఇచ్చారు.
కారణాలు వేరే..
నిజానికి మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఇదివరకు చాలా సార్లు ప్రధాని మోదీని కలిసినప్పటికీ ఇంత హడావుడిగానీ, పార్టీ మార్పుపై ఊహాగానాలుగానీ ఈ స్థాయిలో రాలేదు. మంచు లక్ష్మీ చాలా కాలంపాటు స్వచ్ఛభారత్ అభియాన్ కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించినప్పుడూ ఇలాంటి వార్తలు లేవు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో చేరడం, జగన్ సీఎం అయిన తర్వాత కొంత గ్యాప్ ఏర్పడిందనే పుకార్ల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యం దక్కింది. అయితే ప్రధాని మోదీతో సమావేశం వెనుక రాజకీయ కారణాలేవీ లేవని మంచు లక్ష్మీ స్పష్టం చేశారు.
ఆ రోజు జరిగిన అవమానం..
ఈ మధ్యే పాన్ ఇండియా సినీ నటులందరూ ప్రధాని మోదీని కలిసి.. రెండోసారి ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువ మంది బాలీవుడ్ వాళ్లే ఉండటం, సౌత్ యాక్టర్లకు అంతగా ప్రాధాన్యం దక్కక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పలువురు సౌత్ యాక్టర్లు.. మోడీ ప్రోగ్రామ్ తాలూకు ఫోటోల్నీ ట్వీట్ చేస్తూ ‘మోదీ సార్.. సౌత్ ను మర్చిపోయారా?'అంటూ ప్రశ్నలు సంధించారు. ఆ రోజు జరిగిన అవమానాన్ని సౌత్ యాక్టర్లు మర్చిపోయేలా.. వాళ్లందరితో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ కార్యక్రమానికి మంచు లక్ష్మీ ప్రాతినిధ్యం వహించనున్నారు.
సౌత్ ఇండియా ప్రతినిధిగా..
‘‘ఆ రోజు ప్రధాని మోదీని కలిసే అవకాశం కొంత మంది నటులకే దక్కింది. ఇప్పుడా చాన్స్ సౌత్ యాక్టర్లకు ప్రత్యేకంగా వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావాల్సిందిగా మోదీగారి నుంచి మాట తీసుకున్నాను. సౌత్ ఇండియా రిప్రెజెంటేటివ్ గా మీటింగ్ కు సంబంధించిన వ్యవహరాలన్నీ నేనే చూసుకుంటాను. త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తాం. సౌత్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో మన యాక్టర్ల కలయిక కొత్త ఉత్సాహం నింపుతుంది''అని మంచు లక్ష్మీ వివరించారు.