చంద్రబాబు హ్యాండ్సమ్గా ఉంటారు: కారణం చెప్పిన మంచు లక్ష్మి
సీఎం చంద్రబాబునాయుడు నిత్యం వ్యాయామం చేయడం వల్లనే ఆయన చాలా హ్యాండ్సంగా, స్ట్రాంగ్గా ఉన్నారని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సినీ నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచంలో నలుదిశలా వినిపించేలా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి విజయవాడ నగరంలో రెండో ఎడిషన్ జియో అమరావతి మారథాన్ను ఆదివారం వైభవంగా నిర్వహించారు.
విజయవాడలో ఆదివారం ఉదయం జరిగిన మారథాన్ ప్రారంభ కార్యక్రమంలో మంచు లక్ష్మి పాల్గొని ప్రసంగించారు. మన జీవిన విధానంలో వచ్చిన మార్పులతో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నిత్యం వ్యాయామం చేయడం వల్లనే ఆయన చాలా హ్యాండ్సంగా, స్ట్రాంగ్గా ఉన్నారని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణం ఏప్రిల్ నుంచి మొదలవుతుందన్నారు. భవిష్యత్తులో విజయవాడ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. కృష్ణా నదిపై కొత్తగా వంతెనలు నిర్మాణం కాబోతున్నాయని చెప్పిన ఆయన.. ప్రజలు ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం ఆనందంగా ఉంటుందన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. అమరావతి బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయి వెళ్లడానికి ఈ మారథాన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విజయవాడలో మారథాన్ ను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇలాంటి మారథాన్లు ఎంతో ఉపయోగతాయని మంత్రి కామినేని తెలిపారు.
ఇటువంటి మారథాన్ లు భవిష్యత్తులో మరిన్ని జరగాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కెశినేని శ్రీనివాస్, మేయర్ కోనేరు శ్రీధర్, డిజిపి సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, సిఆర్డిఎ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.