గొప్ప పని! గర్వపడుతూనే ఉంటా: పవన్ కళ్యాణ్, రాంచరణ్పై మంచు మనోజ్ ప్రశంసలు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు సినీ హీరో మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. టిట్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరడంతో ప్రముఖ సినీ నటుడు రాంచరణ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
గ్రామ దత్తతపై రాంచరణ్ని అడుగుతా, శ్రీకాకుళం కోసం ముందుకు రావాలి: పవన్ కళ్యాణ్
ప్రశంసిస్తూ మంచు మనోజ్
తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు ఆనందంగా ఈ పనిచేస్తున్నట్లు రాంచరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ట్వీట్ చేశారు. చరణ్ను సోదరుడని సంభోదిస్తూ మెచ్చుకున్నారు. అంతేగాక, పవన్, చరణ్ కలిసి ఉన్న ఫొటోను మంచు మనోజ్ షేర్ చేశారు.
గర్వపడేలా రాంచరణ్.. పవన్కు ధన్యవాదాలు..
‘మన నుంచే ఇది ప్రారంభం కావాలి. నీ సోదరుడిగా ఎప్పుడూ గర్వపడుతూనే ఉన్నాను. గ్రామాన్ని దత్తత తీసుకోవడం నిజంగా ఓ గొప్ప పని. అవసరాల్లో ఉన్న ప్రజలకు మంచి చేయాలని తెలుపుతూ రాంచరణ్కు స్ఫూర్తి కలిగించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు' అని మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
గర్వంగా ఉందంటూ నిఖిల్
‘టిట్లీ బాధితుల కోసం పెద్ద మనసుతో 750 నిత్యావసర సరుకుల కిట్లు పంపిన రానాను, సరుకులు పంపిన మంచు మనోజ్ను, రూ.25లక్షలు విరాళం అందించిన అల్లు అర్జున్ను, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన రాంచరణ్ను చూస్తుంటే గర్వంగా ఉంది. శ్రీకాకుళం బాధితులకు సహాయం చేసిన మిగిలిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని మరో సినీ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. మరికొందరు సినీప్రముఖుల పేర్లను కూడా ట్విట్టర్లో స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
పవన్కు రాంచరణ్ ధన్యవాదాలు
కాగా, ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. తన సోదరుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్ను జిల్లాలోని ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరతానని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాంచరణ్ తేజ్.. తనకు స్ఫూర్తినిచ్చినందుకు పవన్కు ధన్యవాదాలు చెబుతూ.. తప్పకుండా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు.