అదే నేను చేసిన తప్పు, అంతం చూపిస్తా: బాబుకు మందకృష్ణ హెచ్చరిక, అరెస్ట్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి గుంటూరు ఆసుపత్రిలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
గుంటూరు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి గుంటూరు ఆసుపత్రిలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చదవండి: పొలాల్లో నుంచి ఒక్కసారిగా!: ఎమ్మార్పీఎస్ మెరుపు ధర్నా.. కురుక్షేత్ర అణచివేతపై!
తాను ఏ తప్పు చేశానని అరెస్టు చేశారని నిలదీశారు. తాము ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పర్యటన కొనసాగేలా చూశామని, అది నేను చేసిన తప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
2012లో పాదయాత్ర సమయంలో తెలంగాణలో అడుగు పెట్టే సమయంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అప్పుడు ఎమ్మార్పీఎస్ చంద్రబాబుకు అండగా నిలబడింది. దీనిని మందకృష్ణ గుర్తు చేశారు.
వర్గీకరణకు సహకరిస్తానని ఆనాడు చెప్పిన చంద్రబాబు, ఈ రోజు మాత్రం నోరు మెదపడం లేదన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
వర్గీకరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కురుక్షేత్ర సభ ఆరంభం మాత్రమేనని, అంతం ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు.
కాగా, గాయపడిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పరామర్శించేందుకు మందకృష్ణ గుంటూరు ఆసుపత్రికి వెళ్లారు. అప్పుడు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్తత
అంతకుముందు నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. కురుక్షేత్ర సభకు భారీగా తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎక్కడికి అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
సభకు అనుమతివ్వలేదు
కురుక్షేత్ర మహాసభకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు చెప్పారు. కురుక్షేత్ర మహాసభకు షరతులతో కూడిన అనుమతి ఉందని మందకృష్ణ అబద్ధం చెప్పారన్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ సభకు అనుమతి విషయమై పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించే ఈ సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాగార్జున యూనివర్శిటీ, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఆందోళన చేసినవారిపై కేసులు పెడతామన్నారు.
ఎవరినీ వదిలిపెట్టబోమని, అందరి పైనా చర్యలు తప్పవన్నారు. నాగార్జున యూనివర్శిటీ, ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో రేపు మధ్యాహ్నం వరకు బందోబస్తు కొనసాగుతుందన్నారు.