"చంద్రబాబే అడ్డంకి, అమరావతిలో కురుక్షేత్ర సంగ్రామం"
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ నారా చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. వర్గీకరణకు చంద్రబాబే అడ్డంకి అని నిందించారు.
విజయనగరం: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డంకి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోనూ, విజయనగరం జిల్లా కేంద్రంలోనూ ఆయన మీడియాతో మాట్లాడారు.
రిజర్వేషన్ల అమలుకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు జూలై 7న వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలో 'కురుక్షేత్ర మహాసంగ్రామం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని, తర్వాత జరిగే పరిణామాలకు మాదిగ వ్యతిరేక శక్తులుగా ఉన్న ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో కఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లాగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బీసీల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, బీసీ ఉప కులాల్లోని కొన్నింటిని ఎస్టీల్లో చేర్చుతున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, బీసీ కులాలకు న్యాయం చేయలేక కులాల రిజర్వేషన్లపై వివాదం సృష్టించడం సరి కాదని ఆయన అన్నారు.
దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీసీ జాబితాలో ఉన్న వారికి వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వాలు న్యాయం చేయాలని, అంతేగానీ వారు మోయలేక ఆ భారాన్ని రిజర్వేషన్లపై రుద్దితే అడ్డుకుంటామని హెచ్చరించారు.