హైదరాబాద్ తెలంగాణదే, కాదంటే మట్టి: మందకృష్ణ
సీమాంధ్ర పెట్టుబడిదారులకు కేంద్రం తలొగ్గుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయని, హైదరాబాద్ విషయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనే దానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. హైదరాబాదుపై రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సుశీల్ కుమార్ షిండే అనడాన్ని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదును తెలంగాణనుంచి వేరు చేయాలని చూస్తే సహించబోమని ఆయన అన్నారు.
తెలంగాణ భూములను అక్రమంగా కబ్జా చేసినవారికి హైదరాబాదులో రక్షణ కల్పించడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. హైదరాబాదు లేకపోతే తెలంగాణ ప్రజలు అవమానానికి గురవుతారని, హైదరాబాదును తెలంగాణకు దక్కకుండా చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై బిజెపి ఒక్క ప్రకటన చేస్తే విశేషంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్లు సంకేతాలు అందుతన్న సమయంలో తెలంగాణ కోసం బిజెపి ఒత్తిడి పెంచాలని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల సభ హైదరాబాదుపై దాడి చేసే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి ఎన్జీవోల సభలో రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశారని, తెలంగాణవారిపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు వారికి మాత్రమే స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారని, సమైక్యంగా ఉంచాలని కోరుకునే హక్కు తమకు ఉంది గానీ ఇతరులకు చిన్న రాష్ట్రాలను కోరుకునే హక్కు లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.