మందలగిరి మారాజా ... మీకు మీరే పొగుడుకుంటున్నారా అంటూ లోకేష్ పై సెటైర్లు
విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద, తాజాగా లోకేష్ బాబు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ లు పెడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎన్నికల సమయంలో ఏకిపారేశారు. ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును, లోకేష్ బాబును మాత్రం వదలకుండా టార్గెట్ చేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తల కోసం లోకేష్ ఫేస్ బుక్ పేజ్ ... కార్యకర్తల రక్షణే ధ్యేయమన్న బాబు టెలీకాన్ఫరెన్స్
Recommended Video
చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేష్ ఏమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట విజయసాయి ఎద్దేవా
ఇక విజయసాయి దారిలోనే ట్వీట్ లు చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటున్న లోకేష్ తాజా ట్వీట్లపై విజయసాయి సెటైర్లు వేశారు. ఎల్లంపల్లిలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారంటూ ఏపీ సీఎం జగన్ అనడాన్ని తప్పుపడుతూ లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు . చంద్రబాబుపై ఆరోపణలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే అని కామెంట్ చేశారు.ఇక దీనికి సమాధానంగా మందలగిరి మారాజా అంటూ లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయి రెడ్డి. ‘‘చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?'' అంటూ లోకేష్ ని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. మీకు మీరే సాటి అన్నట్టు చెప్పుకుంటున్నారు అని లోకేష్ పై సెటైర్ వేశారు.
చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అన్న విజయసాయి
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పెట్టే పిల్లి శాపాలకు ఉట్లు కూడా తెగవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల టీడీపీ కార్యకర్తలపై దాడుల గురించి మాట్లాడిన చంద్రబాబు అధికార ప్రభుత్వమైన వైసీపీకి చేసిన పాపాలే శాపాలుగా తగులుతాయంటూ చంద్రబాబు శాపనార్ధాలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా విజయసాయి స్పందించారు.‘‘చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు.'' అంటూ విజయసాయి కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు నివాసం ఎవరిదో చంద్రబాబే చెప్పాలన్న విజయసాయి
ఇక ప్రస్తుతం కూల్చివేత నోటీసు అందుకున్న లింగమనేని గెస్ట్ హౌస్, చంద్రబాబు నివాసం గురించి మాట్లాడుతూ ‘‘లింగమనేని గెస్ట్హౌస్ను ల్యాండ్పూలింగ్లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?'' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.